
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మత్తు పదార్థాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదంటున్నారు. ఈ క్రమంలో కమిషనర్ టాస్క్ఫోర్స్ వెస్ట్జోన్ టీమ్, ఎస్ఆర్నగర్ పోలీసులు కలిసి నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో ఓ మహిళను అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి 11.4 కేజీల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.5.7 లక్షలుగా పోలీసులు అంచనా వేశారు. అరెస్టైన మహిళను రినిత రాయితగా గుర్తించారు. ఆమె వ్యవసాయ పనులు చేస్తూ.. హైదరాబాద్లో గంజాయి విక్రయాలకు సబ్-పెడ్డలర్గా పని చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. రినిత స్వస్థలం ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా అంతరాబా పోస్టు పరిధిలోని కేసరిగూడ ప్రాంతంగా పోలీసులు తెలిపారు.
రినిత వరసుకు సోదరుడైన మానియెల్ దలబెహెరాతో కలిసి హైదరాబాద్కు వచ్చిందని, నగరంలో వివిధ ప్రాంతాల్లో కస్టమర్లకు డ్రై గంజాయి విక్రయాలు చేస్తూ సంపాదన పెంచుకునే ప్రయత్నం చేసిందని టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ మొహమ్మద్ ఇక్బాల్ సిద్ధిక్ తెలిపారు. వీరిద్దరూ కొంతకాలంగా హైదరాబాద్లో ఉంటూ, డ్రగ్స్కు అలవాటు పడిన యువతను టార్గెట్ చేసి గంజాయి సరఫరా చేస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. టాస్క్ఫోర్స్కు అందిన పక్కా సమాచారం ఆధారంగా వెస్ట్జోన్ టీమ్, ఎస్ఆర్నగర్ పోలీసులు కలిసి వలపన్ని మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద ఉన్న సంచిని తనిఖీ చేయగా అందులో భారీగా ఎండు గంజాయి లభ్యమైంది. వెంటనే ఆ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేసే మహా శత్రువని.. వాటి బారిన పడి యువత తమ భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ఎవరైనా డ్రగ్స్ను వీడలేక ఇబ్బంది పడుతుంటే తమను సంప్రదిస్తే కౌన్సిలింగ్ ఇప్పిస్తామంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.