
రియల్ ఎస్టేట్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్న అతగాడు నర్సుపై కన్నేశాడు. ఆమెపై బలాత్కారానికి యత్నించాడు. ప్రతిఘటించడంతో ఏకంగా ఆమె ప్రాణాలు తీశాడు. హైదరాబాద్లో ఈ ఘటన సంచలనంగా మారింది. కొత్తగూడెం జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువతి 7 నెలల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. విధుల్లో భాగంగా ఆమె ఆసుపత్రిలోనే కేటాయించిన గదిలో ఉంటుంది. శనివారం మధ్యాహ్నం గదిలోకి వెళ్లిన ఆమె ఎంతసేపటికీ బయటకు రాలేదు. దీంతో ఆసుపత్రి సిబ్బందికి అనుమానం వచ్చింది. తలుపులు పగల కొట్టి చూడగా, యువతి నేలపై విగతజీవిగా పడి ఉంది. దీంతో వారంతా షాక్కి గురయ్యారు. ఆమె శరీరంపై గాయాలు ఉండటంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టారు.
ఘటనాస్థలంలో లభించిన ఆధారాలను బట్టి హత్యగా అనుమానించారు. విచారణలో భాగంగా రియల్ ఎస్టేట్ సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తున్న బిహార్కు చెందిన సైనావుల్లా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు విచారణలో అతను నేరం అంగీకరించాడు. శనివారం మధ్యాహ్నం కిటికీలోంచి నర్సు గదిలోకి దూకిన సైనావుల్లా ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో బాధితురాలు గట్టిగా కేకలు వేస్తూ ప్రతిఘటించింది, భయపడిపోయిన నిందితుడు ఆమె గొంతు నులిమి హత్య చేసి పారిపోయాడు. ఈ విషయాన్ని నేరుగా పోలీసుల విచారణలో చెప్పాడు సైనావుల్లా.
ఈ విషయం తెలిసిన నగరవాసులు ఉలిక్కిపడ్డారు. మృతురాలి కుటుంబసభ్యులతో పాటు కాంగ్రెస్, బీజేపీ నాయకులు పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ఒక్క ఘటనే కాదు.. మహేశ్వరం నియోజకవర్గంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని BJP నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల భద్రత పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..