
హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్ గణేషుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో తొలి రోజు నుంచే మహాగణపతిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
ఘనంగా తొలిపూజ కార్యక్రమం
ఖైరతాబాద్ గణనాథుడికి రాష్ట్ర గవర్నర్ శివ్ప్రతాప్ శుక్లా తొలిపూజ నిర్వహించారు. ఈ తొలిపూజ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం, మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ఉత్సవాలు ప్రశాంతంగా, విజయవంతంగా జరగాలంటే భక్తుల సహకారం కూడా ఎంతో అవసరమని ఆయన కోరారు.
భారీ భద్రతా ఏర్పాటు
ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు, పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ పరిసరాల్లో 12 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంచారు. భక్తులు సులభంగా స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అలాగే ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 150కి పైగా సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంచారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.