Hyderabad: భాగ్యనగర సిగలో మరో అద్భుత నిర్మాణం.. పట్నంలో రెండో కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడ రానుందంటే..
Hyderabad: హైదరాబాద్ మహా నగరం రోజురోజుకీ అభివృద్ధి చెందుతూ విశ్వనగరం దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఐటీ, ఫార్మా రంగాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన...
Hyderabad: హైదరాబాద్ మహా నగరం రోజురోజుకీ అభివృద్ధి చెందుతూ విశ్వనగరం దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఐటీ, ఫార్మా రంగాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన భాగ్యనగరంలో ఎన్నో ఐకానిక్ నిర్మాణాలు జరిగాయి. ఇలాంటి వాటిలో కేబుల్ బ్రిడ్జ్ ఒకటి. దుర్గం చెరువుపై నిర్మించిన ఈ బ్రిడ్జ్తో నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చడంతో పాటు, నగరానికి ఒక ఐకానిక్ నిర్మాణంగా మారింది. వారాంతం వచ్చిందంటే చాలు నగరవాసులు కేబుల్ బ్రిడ్జ్పై సందడి చేస్తుంటారు. అద్భుత నిర్మాణ కౌశలంతో నిర్మించిన ఈ బ్రిడ్జ్ నగరంలో ఉత్తమ నిర్మాణాల్లో ఒకటిగా పేరుగాంచింది.
ఇదిలా ఉంటే హైదరాబాద్లో మరో కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం జరగనున్నట్లు తెలుస్తోంది. మీర్ అలామ్ ట్యాంక్పై ఈ కొత్త బ్రిడ్జ్ని నిర్మించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతిపాదనాలు సిద్ధం చేసినట్లు సమాచారం. 2.5 కిలోమీటర్ల పొడవుతో ఆరు లైన్లుగా దీనిని నిర్మించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ బ్రిడ్జ్ బెంగళూరు హైవేను, చింతల్మెట్ రోడ్ను కలపనుంది. ఈ నిర్మాణం హైదరాబాద్కు మరో ఐకాన్గా మారనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా బెంగళూరు హైవే నుంచి అత్తాపూర్, మెహిదీపట్నం రావాల్సిన వారు చుట్టూ తిరిగి రాకుండా కేబుల్ బ్రిడ్జ్పై కేవలం పది నిమిషాల్లోనే చేరుకునే అవకాశం లభిస్తుంది. అత్యంత ఆధునిక హంగులతో, టూరిజంను అభివృద్ధి చేసేలా ఈ బ్రిడ్జ్ని నిర్మించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అవసరమయ్యే భూసేకరణ విషయంలో ఉన్న సమస్యలపై అధికారులు దృష్టిసారించినట్లు సమాచారం. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే త్వరలోనే హైదరాబాద్లో మరో కేబుల్ బ్రిడ్జ్ సందడి చేయనుంది.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..