
ఇంటి ముందున్న కారులో మంటలు చెలరేగి అక్కడికక్కడే కారు సగం కాలిపోయిన ఘటన హైదరాబాద్ హయత్నగర్లో పీఎస్ పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెల్తే.. స్థానికంగా నివాసం ఉంటున్న మాధవ రెడ్డి అనే వ్యక్తి ఎప్పటిలాగే తన ఇంటి ముందే కార్ను పార్క్ చేశాడు. అయితే ఆదివారం ఒక్కసారిగా ఉన్నట్టుండి ఇంటి ముందు పార్క్ చేసిన అతని కారు నుంచి మంటలు రావడం స్టార్ట్ అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే బకెట్లతో నీరు పోసి మంటలను ఆర్పేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
ఇక ఘటనాస్థలానికి చేరుకున్న హయత్నగర్ పోలీసులు దగ్ధమైన కారును పరిశీలించారు.మంటలు ప్రమాదవశాత్తు చెలరేగాయా? లేక ఎవరైనా కావాలనే కారుకు నిప్పంటించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే తన కారును ఆకతాయిలు కావాలనే తగలబెట్టారని యజమాని మాధవ రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఘటనకు ముందు, తర్వాత అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు అక్కడ సంచరించాయా అనే వివరాలను సీసీటీవీ ద్వారా ఆరా తీస్తున్నారు.
కారు పూర్తిగా దగ్ధం కావడంతో శంకర్నగర్లో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. సీసీ కెమెరాల ఫుటేజీ, ఘటనాస్థలంలో లభించిన ఆధారాలను పరిశీలించిన తర్వాతే మంటలకు అసలు కారణం ఏంటన్నది తేలుతుందని పోలీసులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.