Hyderabad: తాగి రూమ్‌కి రావొద్దన్నందుకు.. కత్తితో పొడిచి హాస్టల్‌ మేట్‌ను చంపేశాడు

|

Jul 28, 2024 | 12:54 PM

ఎస్‌ఆర్‌నగర్‌లో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. నంద్యాలకు చెందిన వెంకటరమణను తోటి రూమ్ మేట్ కత్తితో పొడిచి చంపేశాడు. పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Hyderabad: తాగి రూమ్‌కి రావొద్దన్నందుకు.. కత్తితో పొడిచి హాస్టల్‌ మేట్‌ను చంపేశాడు
Venkata Ramana
Follow us on

హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. బార్బర్ షాప్‌లో ఉపయోగించే కత్తితో తోటి రూమ్ మేట్‌పై దాడిచేసి చంపేశాడు ఓ వ్యక్తి. పోలీసుల కథనం ప్రకారం.. ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేసే వెంకటరమణ, బార్బర్ షాప్‌లో పనిచేసే గణేశ్ కలిసి హాస్టల్‌లో ఒకే రూములో ఉంటున్నారు. గణేశ్‌కు మద్యం తాగే అలవాటు ఉండడంతో నిత్యం రాత్రి మద్యం తాగి రూముకు వచ్చి.. న్యూసెన్స్ క్రియేట్ చేసేవాడు. దీంతో తనకు నిద్రాభంగమవుతోందని, తాగి రూముకు రావొద్దని గణేశ్‌ను వెంకటరమణ పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ అతడి తీరు మారలేదు.

గత అర్ధరాత్రి మరోమారు తాగి రావడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. అది కాస్తా ముదరడంతో కోపంతో ఊగిపోయిన గణేశ్ సెలూన్‌లో ఉపయోగించే కత్తితో వెంకటరమణను విచక్షణ రహితంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడిన వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెంకటరమణది కర్నూలు జిల్లా ఆలమూరని పోలీసులు తెలిపారు. అయితే ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  దీంతో పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..