హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన సన్ బర్న్ ఈవెంట్ రద్దయింది. ఈ ఈవెంట్కు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. అదే సమయంలో సన్బర్న్ ఈవెంట్పై ప్రభుత్వం సీరియస్ అయిన తర్వాత, బుక్ మై షో సంస్థ టికెట్ విక్రయాలు నిలిపేసింది. అనుమతి లేకుండానే, టికెట్లను విక్రయించినందుకు బుక్ మై షో మీద కేసు నమోదైంది. ఇప్పటికే బుక్ మై షో, సన్ బర్న్ నిర్వహకులకు పోలీసులు నోటీసులు జారీచేశారు. పోలీస్ కేస్ తర్వాత, బుక్ మై షోలో హైదరాబాద్ ఈవెంట్ కనిపించలేదు.
డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపుతామని CM రేవంత్ రెడ్డి ప్రకటించిన తర్వాత, సీన్ మారింది. డ్రగ్సేకాదు, మత్తు మరకలతో అంటకాగిన ఎవర్నీ వదిలే ప్రసక్తే లేదని అసెంబ్లీలో CM తేల్చేసిన తర్వాత పోలీసులు అలర్ట్ అయ్యారు. అంతేకాదు న్యూ ఇయర్ ముసుగులో జరిగే ఈవెంట్స్పైనా నిఘాపెట్టాలన్న రేవంత్ ఆదేశాలతో అధికార యంత్రాంగమంతా స్పీడ్ పెంచింది. వెంటనే, న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. టికెట్లు అమ్మి ఈవెంట్లు నిర్వహించే సన్బర్న్, బుక్మైషో వంటి సంస్థలకు పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరి అని సైబరాబాద్ సీపీ మహంతి తేల్చేశారు. సన్బర్న్కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని పోలీసులు తెలిపారు.
తాజాగా పోలీసులు కొరడా దెబ్బ కొట్టడంతో, సన్బర్న్ ఈవెంట్ రద్దయింది. బుక్ మై షో కూడా చేతులు ఎత్తేసింది. ఇక న్యూఇయర్ వేడుకల పేరుతో సాగే జల్సాలకు ఎలా చెక్ పెడతారన్నదే ఆసక్తిగా మారింది. మొత్తానికైతే, ఈసారి మాటలే కాదు, చేతలు కూడా గట్టిగానే ఉంటాయనే సంకేతాలు వెళుతున్నాయి. దీంతో ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలతోపాటు, రంగేళీరాజాలు కూడా ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిన పరిస్థితి.