Hyderabad: సామాన్యుడు హైదరాబాద్‌లో బతకగలడా..? డబుల్ బెడ్‌రూమ్ రెంట్ ఎంతో తెల్సా..?

|

Jun 24, 2024 | 6:57 PM

భాగ్య నగరం విస్తరిస్తోంది. ఐటీ,నిర్మాణ రంగం, వైద్యం, విద్య...ఇలా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్‌కి దేశం నలుమూలల నుంచి వలసలు బాగా పెరిగాయి. దీంతో నగరం కోటి పైగా జనాభాతో కిటకిటలాడుతోంది. దీంతో అద్దె ఇళ్లకు డిమాండ్‌ బాగా పెరిగిపోయింది. నగరం నడిబొడ్డునే కాదు...శివార్లలో కూడా సామాన్యుడికి షాక్ కొట్టే రేంజ్‌లో రెంట్లు పెరిగాయి. ఐటీ కంపెనీలు, ప్రముఖ విద్యా సంస్థలు, ఆస్పత్రులు ఉన్నచోట్ల ఈ డిమాండ్‌ మరింత ఎక్కువగా ఉంది. ఇల్లు చారెడు...అద్దె బారెడు అన్నట్లు మారింది పరిస్థితి.

Hyderabad: సామాన్యుడు హైదరాబాద్‌లో బతకగలడా..? డబుల్ బెడ్‌రూమ్ రెంట్ ఎంతో తెల్సా..?
House For Rent
Follow us on

హైదరాబాద్‌ మహా నగరంలో ఇంటి అద్దెలు బాగా పెరిగిపోయాయి. నగరంలోనే కాదు…నగర శివార్లలోనూ ఇదే పరిస్థితి. విద్యాసంస్థలు, ఐటీ కంపెనీలు, ఆస్పత్రులు, ప్రైవేట్ కంపెనీలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో అద్దె ఇళ్లకు డిమాండ్‌ బాగా పెరిగింది. ఒక ఏరియాకు ఇది పరిమితం కాలేదు. ప్రతి ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి. దీంతో ఎక్కడ చూసినా అద్దె ఇంటికి డిమాండ్‌తో పాటు రెంట్లు విపరీతంగా పెరిగాయి.

ఐటీ ఏరియాల్లో అదిరే డిమాండ్‌

కరోనా సమయంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఉండడంతో చాలామంది సొంత ఉళ్ళకు వెళ్లిపోయారు. దీంతో నగరంలో చాలావరకు టూలెట్ బోర్డులు కనిపించేవి. అయితే ఆ తర్వాత ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు హాజరవుతున్నారు. దీంతో ఐటీ ఆఫీసులకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ హౌస్‌లు హాట్ కేకుల్లా మారాయి.
బైట్‌: హేము

కరోనా తర్వాత అద్దెలు రెట్టింపు

కరోనా తర్వాత ఇంటి అద్దెలు కొన్నిచోట్ల రెట్టింపు అయ్యాయి. గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ఇంటి అద్దెలు ఆరు నెలల కాలంలో 15 శాతానికి పైగా పెరిగాయి. బేగంపేట్, ప్రకాష్ నగర్,సోమాజిగూడ, పంజాగుట్ట బోయిన్పల్లి,మారేడుపల్లి, అల్వాల్ ప్రాంతాల్లో 20 నుండి 25శాతం అద్దె లు పెరిగాయి. ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఇంటి అద్దెలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. జీతాలు తప్ప అన్ని పెరుగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసే సగటు జీవి…ఈ రెంట్‌ షాక్ తట్టుకోలేక శివారు ప్రాంతాలకు వెళితే…అక్కడ కూడా అద్దెలు పెంచేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

డబుల్‌ బెడ్‌రూమ్ అద్దె 25 వేలు

ఓ అధ్యయనం ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ఇంటి రెంట్లు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలోనే పది నుంచి పదిహేను శాతం పైగా పెరిగాయి. గతంలో 10, 15 వేలకు నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకు లభించేవి కానీ ఇప్పుడు 20 నుంచి 25 వేల పైగా ఖర్చు చేస్తే దొరకని పరిస్థితి.

శివార్లలోనూ పెరిగిన డిమాండ్‌

నగర శివారు ప్రాంతాల్లో…సింగిల్ బెడ్ రూం ఇంటి అద్దె ప్రస్తుతం 7 వేల నుంచి 9 వేల రూపాయల వరకు ఉంది. డబుల్ బెడ్ రూం అద్దె 11 వేల నుంచి 15 వేల వరకు ఉంది. మధ్యతరగతి ప్రజలు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్లు అద్దెలు తక్కువగా ఉన్న ప్రాంతాలకు మారుతున్నారు. శివారు ప్రాంతాలైన బోడుప్పల్, పీర్జాదిగూడ, హయత్ నగర్, ఎల్బీనగర్, నిజాంపేట్, బండ్లగూడ జాగీర్ తదితర ప్రాంతాల్లో అద్దె ఇళ్ళకి డిమాండ్ పెరిగింది.

అద్దెని షేర్‌ చేసుకుంటున్న వైనం

శివారు ప్రాంతాల నుంచి ఐటీ ఆఫీసులకు వెళ్లడం కష్టమని భావించిన కొందరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు విదేశాల్లో మాదిరిగా డబుల్ , ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లను పంచుకుంటున్నారు. ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలతో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరికొందరు పేయింగ్ గెస్ట్‌లుగా ఉంటూ అద్దె భారాన్ని తప్పించుకుంటున్నారు.  అద్దె ఇళ్లకు డిమాండ్ పెరగడంతో యజమానులు ఏటా అద్దెలు పెంచుతున్నారు. భవిష్యత్తులో ఔటర్ రింగ్ వెలుపల కూడా అద్దెకు ఇళ్లు దొరకడం కష్టంగా మారే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…