
హైదరాబాద్లోని అంబర్పేట్లో మూసీ నదిలో గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. శనివారం (ఆగస్టు 22) నది మధ్యలో మృతదేహం కొట్టుకురావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అంబర్పేట్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు.
మూసీ నదిలో ప్రవాహం మధ్యలో మృతదేహం ఉండటంతో దాన్ని బయటకు తీసేందుకు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మృతదేహం ఓ పురుషుడిదిగా పోలీసులు భావిస్తున్నారు. అయితే మృతుడి వయసు, పేరు, చిరునామా తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. మృతుడి వివరాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? మూసీ నదిలోకి ఎలా చేరుకున్నారు? ప్రమాదవశాత్తూ నదిలో పడ్డారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టామన్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మృతికి గల అసలు కారణంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు మూసీ నదిలో మృతదేహం కనిపించడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలానికి చేరుకున్నారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులను గుర్తించి సమాచారం అందించేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..