
హైదరాబాద్ పాతబస్తీలోని పటేల్ మార్కెట్లో దుకాణదారుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దుకాణం ముందు వస్తువుల డిస్ప్లే విషయంలో మొదలైన చిన్న వివాదం చివరకు కత్తులు, ఇనుప రాడ్లు, కర్రలతో దాడులు చేసుకునే స్థాయికి చేరింది. ఒక దుకాణదారుడికి, పక్కనే ఉన్న మరో దుకాణం యజమానులు, సిబ్బందికి మధ్య వస్తువుల డిస్ప్లే విషయంలో మొదట మాటామాటా జరిగింది.
అయితే పరిస్థితి అదుపు తప్పడంతో ఒక వర్గానికి చెందిన వ్యక్తి తన స్నేహితులు, సోదరులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటికే 10 నుంచి 15 మంది వ్యక్తులు కత్తులు, ఇనుప రాడ్లు, కర్రలతో అక్కడికి చేరుకున్నారు. అనంతరం పక్కనే ఉన్న దుకాణం యజమానులు, అక్కడ పనిచేస్తున్న సిబ్బందిపై ఒక్కసారిగా దాడి చేసి నానా హంగామా సృష్టించారు. ఈ మొత్తం ఘటన అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.
బాధితుల ఫిర్యాదు మేరకు చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దుకాణం ముందు మొదలైన వివాదం ఎలా పెద్ద గొడవగా మారింది? బయట వ్యక్తులను ఎవరు పిలిపించారు? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ దాడికి కారణం కేవలం వస్తువుల డిస్ప్లే మాత్రమేనా? లేక దీని వెనుక మరేదైనా పాత గొడవ ఉందా? అనే కోణంలో కూడా వివరాలు సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్న పోలీసులు.. దాడిలో పాల్గొన్న వ్యక్తులను గుర్తించే పనిలో ఉన్నారు.
భయాందోళనలో వ్యాపారులు
మరోవైపు పటేల్ మార్కెట్లో వారం రోజుల వ్యవధిలోనే ఇలాంటి ఘటన రెండోసారి జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రద్దీగా ఉండే వ్యాపార ప్రాంతంలో వరుసగా ఘర్షణలు చోటుచేసుకోవడంతో దుకాణదారులు, వ్యాపారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో తక్షణమే భద్రతను పెంచడంతో పాటు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.