
బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో చైన్ స్నాచింగ్లు, దొంగతనాలు పెరుగుతున్నాయన్నది నిజం. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డుపై బంగారం కనిపిస్తే చాలామంది దాచేసుకునే సందర్భాలే ఎక్కువ. కానీ, కొందరి నిజాయితీ మాత్రం ఇంకా సమాజానికి నమ్మకం ఇస్తూనే ఉంది. మెదక్ జిల్లా తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అరుదైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అల్లాపూర్ గ్రామానికి చెందిన నరసింహులు తన కుమార్తె వివాహ సందర్భంగా బంగారు నగలను తీసుకుని దొంతి గ్రామానికి వెళ్తుండగా, బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ద్విచక్ర వాహనంపై నుంచి బ్యాగ్ కింద పడిపోయింది. అయితే ఈ విషయం గమనించకుండా ఆయన ముందుకు వెళ్లిపోయారు.
ఇదే సమయంలో రోడ్డుపై పడిపోయిన ఆ బ్యాగ్ను గమనించిన టీ స్టాల్ నిర్వాహకులు నాగరాజు, కృష్ణ దాన్ని స్వాధీనం చేసుకున్నారు. బ్యాగ్లో సుమారు తొమ్మిది తులాల బంగారు నగలు ఉన్నప్పటికీ, వారు ఎలాంటి ఆశపడి వాటిని తమ దగ్గర ఉంచుకోకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి బ్యాగ్ను అప్పగించారు. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన నాగరాజు, కృష్ణలను తూప్రాన్ డీఎస్పీ ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ ఘటనతో మంచితనం, నిజాయితీ ఇంకా సమాజంలో ఉందన్న నమ్మకం మరోసారి బలపడింది.
Also Read: ఇలా చేస్తే కాకరకాయ చేదు అన్నదే ఉండదు.. ఇకపై ఆస్పత్రుల ఖర్చులు కూడా ఉండవ్..