
హైదరాబాద్ కేపీహెచ్బీ పరిధిలోని ఇండిస్ వన్ సిటీ అపార్ట్మెంట్లో మద్యం మత్తులో చేసిన ఒక చిన్న ప్రాంక్ మెసేజ్ ఏకంగా రూ.30 లక్షల హవాలా, బెట్టింగ్ ముఠా గుట్టును రట్టు చేసింది. ఆ అపార్ట్మెంట్లో విందు చేసుకుంటున్న సుమంత్ అనే యువకుడు మద్యం మత్తులో తాను కిడ్నాప్ అయ్యానంటూ ప్రియురాలికి మెసేజ్ పంపాడు. ఆ మెసేజ్ చూసి తీవ్రంగా భయాందోళనకు గురైన యువతి ఆలస్యం చేయకుండా వెంటనే 112 నంబర్కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. యువతి ఫిర్యాదుతో తీవ్రంగా పరిగణించిన పోలీసులు జియో లొకేషన్ ఆధారంగా సదరు ఫ్లాట్కు హుటాహుటిన చేరుకున్నారు.
తీరా ఫ్లాట్కు వెళ్లిన పోలీసులు లోపల తనిఖీలు చేపట్టగా అక్కడొక సూట్కేసులో ఏకంగా రూ. 30 లక్షల నగదు బయటపడింది. కిడ్నాప్ డ్రామా పక్కనబెట్టి ఆ నగదుకు సంబంధించిన రికార్డులు చూపిస్తారా అని పోలీసులు ప్రశ్నించగా సదరు యువకులు నీళ్లు నమిలారు, సరైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వారి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని లోతుగా తనిఖీ చేయగా, అసలు క్రికెట్ బెట్టింగ్ మరియు హవాలా నెట్వర్క్ వ్యవహారాలు విస్తుపోయేలా వెలుగులోకి వచ్చాయి. వెంటనే ఆ ముగ్గురు యువకులను, రూ. 30 లక్షల సూట్కేసును కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్కు తరలించారు.
పోలీసుల విచారణలో ఆ యువకులు ఆంధ్రప్రదేశ్లోని చంద్రగిరి పరిసర ప్రాంతాలకు చెందిన సుమంత్, మనోజ్, గౌతమ్గా గుర్తించారు. వీరు కేపీహెచ్బీలో షేరింగ్ పద్ధతిలో ఫ్లాట్ అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. వీరిలో మనోజ్ అసిస్టెంట్ ఫిల్మ్ డైరెక్టర్గా, గౌతమ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్గా పనిచేస్తుండగా.. సుమంత్ ప్రధానంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్లు తేలింది. ఈ రూ.30 లక్షల నగదు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికి చేరవేసేందుకు సిద్ధం చేశారు? అనే హవాలా కోణంలో కేపీహెచ్బీ పోలీసులు కేసు నమోదు చేసి తీవ్ర స్థాయిలో విచారణ జరుపుతున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..