
షార్ట్ సర్క్యూట్ లేదా కారణాలతో ఇంట్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్న ఘటనలు మనం చూస్తూ ఉంటాం. ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలడం లాంటివి ఎక్కడో ఒకచోట జరుగుతూ ఉంటాయి. తాజాగా అందరు ఇంట్లో ఉండగా ఫ్రిడ్జ్ పేలిపోయింది. ఒక్కసారి పేలిన శబ్దం రావడంతో ఇంట్లో ఉన్నవారందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో ఒక్కసారిగా కలకలం రేగింది. గాయత్రి శ్రీనివాసం అపార్ట్మెంట్లో నివాసముంటున్న ఓ కుటుంబానికి ఊహించని ప్రమాదం ఎదురైంది. ఇంట్లో అందరూ ఉన్న సమయంలోనే హఠాత్తుగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఫ్లాట్లోని ఫ్రిడ్జ్లో మొదలైన మంటలు క్షణాల్లోనే ఇల్లంతా వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిడ్జ్ పూర్తిగా కాలిపోయి పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో మంటల తీవ్రత మరింత పెరిగింది. ఇంట్లో ఉన్న టీవీ,సోఫా,ఏసీ, విలువైన వస్తువులు,బట్టలు, కీలక పత్రాలు అగ్ని ఆహుతయ్యాయి. క్షణాల వ్యవధిలోనే ఫ్లాట్ మొత్తం పొగ నిండిపోయింది. ప్రమాదాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అప్రమత్తమై బయటకు పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. అందరూ సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. అపార్ట్మెంట్లోని మిగతా ఫ్లాట్లకు మంటలు వ్యాపించకుండా వెంటనే మంటలు అర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మరో వైపు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.