
ఆడుకుంటూ, చదువుకుంటూ భవిష్యత్తు వైపు అడుగులు వేయాల్సిన 13 ఏళ్ల బాలుడు.. సొంత తండ్రి చేతిలోనే అత్యంత పాశవికంగా ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత అదే తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కన్న కొడుకును గుండెల్లో పెట్టుకుని పెంచాల్సిన తండ్రే.. అతని పాలి కాలయముడుగా మారడం ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
నల్లగొండ జిల్లా అప్పాజీపేటకు చెందిన పబ్బతి లింగారెడ్డి, కవిత దంపతులు ఉద్యోగరీత్యా నల్లగొండలో నివాసం ఉంటున్నారు. ట్రాన్స్ కో డిపార్ట్మెట్లో జూనియర్ లైన్మెన్గా లింగారెడ్డి పని చేస్తున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కొడుకులు దంపతులు అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్న పెద్దకొడుకు ప్రశాంత్ రెడ్డి వద్దకు ఉదయం తల్లి కవిత వెళ్ళింది. ఆ తర్వాత లింగారెడ్డి తండ్రి సత్తిరెడ్డి కూడా అప్పాజీపేట గ్రామానికి వెళ్ళాడు. ఇంట్లో తండ్రి లింగారెడ్డి, చిన్న కొడుకు ప్రణీత్ రెడ్డి మాత్రమే ఉన్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ కొడుకు ప్రణీత్ రెడ్డి తలపై తండ్రి లింగారెడ్డి సుత్తితో బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై ప్రణీత్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కొడుకును చంపిన అనంతరం తీవ్ర మనస్తాపానికి గురైన లింగారెడ్డి, ఇంట్లోనే ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం హైదరాబాదు నుండి తిరిగి వచ్చిన కవితకు ఇంటి గేటు పెట్టి ఉంది. భర్త లింగారెడ్డికి ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదు. దీంతో చుట్టుపక్కల వారితో కలిసి తలుపులు బద్దలుకొట్టి చూడగా.. తండ్రీ కొడుకులు ఇద్దరూ శవాలై పడి ఉన్నారు.
విషయం తెలుసుకున్న నల్లగొండ వన్ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్లూస్, డాగ్ స్క్వాడ్ తో ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలంలో బాలుడి తలపై తీవ్ర గాయాలు కనిపించగా, ఇంట్లో సుత్తి లభించింది. మరోవైపు లింగారెడ్డి మృతదేహం వద్ద పురుగుల మందు డబ్బా దొరికింది. దీంతో హత్య అనంతరం ఆత్మహత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..