
అటవీ ప్రాంతంలో ఉండాల్సిన నెమలి దారితప్పి జనవాసాలకు వచ్చింది. గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు జారి పడిపోయింది. ప్రాణాల కోసం తల్లడిల్లుతున్న నెమలి చూసిన స్థానికులు బయటకు తీసి రక్షించారు. గాయపడ్డ నెమలికి ప్రథమ చికిత్స అందించి, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం నెమలిని డీర్ పార్క్కు తరలించారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామ శివారులో ఓ వ్యవసాయ బావిలో జాతీయ పక్షి నెమలి పడిపోయింది. ఇటీవల కాలంలో కుక్కలు పెరిగిపోవడంతో నెమళ్లు కనబడితే వాటి వెంటపడుతున్నాయి. అంతేకాకుండా అటవీ ప్రాంతం అంతరించిపోవడంతో అక్కడ ఉండాల్సిన జంతువులన్నీ గ్రామాలకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే జాతీయ జంతువు నెమలి కూడా జనవాసాలకు వచ్చింది. ప్రమాదవశాత్తు నెమలి బావిలో పడిపోయింది. బావిలో నీళ్లు ఎక్కువ ఉండడంతో తీవ్రంగా గాయపడింది.
బావి నుంచి నెమలి అరుపులు విన్న రైతులు.. అతికష్టం మీద దాన్ని బయటకు తీశారు. గాయాలు కావడంతో ప్రథమ చికిత్స అందించి, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. తరువాత ఈ నెమలిని బసంతనగర్లోని డీర్ పార్కుకు తరలించారు అక్కడే నెమలికి చికిత్స అందించనున్నారు. ఇటీవల కాలంలో అటవీ ప్రాంతంలో ఉండాల్సిన జంతువులన్నీ కూడా జనావాసాలకు వస్తున్నాయి. అటవీ ప్రాంతం అంతరించడం అక్కడ నీళ్లు లేకపోవడంతో వ్యవసాయం బావుల దగ్గరకు లేదంటే చెరువులు.. కుంటల దగ్గరకు వస్తున్నాయి. ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి.
గతంలో మల్లాపూర్ మండలంలో కూడా నెమళ్లు విషగూళికలు తిని చనిపోయిన సంఘటనలున్నాయి. ఇటీవల కాలంలో నెమళ్ళ సంఖ్య కూడా పెరిగిపోయింది. కానీ అటవీ ప్రాంతం తగ్గడంతో జనావాసాలకు వస్తున్నాయి. దీంతో తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ క్రమంలో అటవీ ప్రాంతాలను రక్షించి వీలైన చెట్లు ఎక్కువ పెంచాలని స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి. ఈ నెమలి ప్రస్తుతం కోలుకుంటుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. నెమళ్లకు ఎలాంటి హానిచేసిన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు అంటున్నారు. ఎక్కడైనా జంతువులు జనవాసాలకు వస్తే, తమకు సమాచారం ఇవ్వాలని, వాటి సురక్షితంగా పట్టుకుని మళ్లీ అదే ప్రాంతంలో వదిలిపెడతామని అటవీశాఖ అధికారులు తెలిపారు.
వీడియో ఇక్కడ చూడండి…
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..