
హైదరాబాద్ మహానగరంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరోసారి భారీ సోదాలతో విరుచుకుపడ్డారు. తెలంగాణ డీజీపీ కార్యాలయంలోని కంప్యూటర్స్ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న భీమ్ రెడ్డి లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే నమ్మదగిన సమాచారం, ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో రంగంలోకి దిగారు.
హైదరాబాద్ నగరంలోని తారామతి బారామతి ప్రాంతంలో ఉన్న భీమ్ రెడ్డి లగ్జరీ విల్లాతో పాటు, ఆయనకు సంబంధించిన సన్నిహితులు, బంధువుల ఇళ్లే లక్ష్యంగా సుమారు పది ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. గురువారం (జూలై 02) ఉదయం నుంచే ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి.
ఇప్పటివరకు జరిగిన సోదాల్లో భీమ్ రెడ్డి నివాసం నుండి భారీగా అక్రమ ఆస్తులను అధికారులు గుర్తించారు. ఆయన ఇంట్లో పెద్ద ఎత్తున బంగారు, వెండి ఆభరణాలతో పాటు వెండి బిందెలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఇంట్లో నిల్వ ఉంచిన భారీ మొత్తంలో విదేశీ మద్యం బాటిళ్లను సైతం అధికారులు కనుగొన్నారు. పలు కీలకమైన ల్యాండ్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు, వాటి విలువను లెక్కగట్టే పనిలో పడ్డారు. సోదాలు ఇంకా కొనసాగుతుండటంతో, భీమ్ రెడ్డి అక్రమాస్తుల విలువ మరిన్ని కోట్ల రూపాయల్లో తేలే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది.
వీడియో ఇక్కడ చూడండి…
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..