
జనగామ జిల్లాలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పసికందు కిడ్నాప్ కలకలం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇంక్యుబేటర్ల వార్డులో చికిత్స పొందుతున్న పసికందును ఓ మాయలేడి కిడ్నాప్ చేసింది. బాలింతలా నటించి ఆ పసికందుకు పాలిస్తానని నమ్మించి అపహరించింది. పసికందును తన కొంగులో చుట్టుకొని పారిపోతున్న క్రమంలో కుటుంబ సభ్యులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు.. ఆటోలో వెళుతున్న ఆమెను వెంబడించి క్యాచ్ చేశారు. ఆమెను ఆసుపత్రికి తీసుకువచ్చి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
ఈ కిడ్నాప్ సంఘటన జనగామ జిల్లా చంపక్ హిల్స్ ప్రాంతంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో జరిగింది.. ఆస్పత్రి ఆవరణలో తిష్టవేసిన ఓ మాయలేడి పసిపిల్లల ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేసింది. కానీ ఆ పసికందు కుటుంబ సభ్యుల అప్రమత్తతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఇంక్యుబేటర్ వార్డులో మగ శిశువు చికిత్స పొందుతున్నాడు. రాత్రి ఆ శిశువు ఏడుస్తున్న క్రమంలో అక్కడే ఉన్న ఓ మహిళ బాలింతలా నటించింది. తన బిడ్డే అని పాలిస్తానని నమ్మించింది. ఆ పసికందుకు పాలిస్తున్నట్లు నటించి తన కొంగులో చుట్టుకొని పారిపోయింది.
ఈ క్రమంలో అక్కడే ఉన్న పసికందు కుటుంబసభ్యులు వార్డులోపలికి వెళ్లి వాళ్ల శిశువు లేదని గుర్తించారు.. వెంటనే అప్రమత్తమై ఆ మహిళను వెంబడించారు. ఆటోలో వెళ్తున్న మహిళను వెంబడించి చాకచక్యంగా పట్టుకున్నారు.
ఆ మహిళను అదే ఆటోలో తిరిగి ఆస్పత్రికి తీసుకువచ్చారు.. కిడ్నాపైన పసికందును స్వాధీనం చేసుకుని ఆ మాయలేడికి దేహశుద్ధి చేశారు.. అడ్డువచ్చిన సెక్యూరిటీ సిబ్బందిపై కూడా దాడి చేశారు.
పసికందును ఆటోలో తరలిస్తుండగా అచ్చం సినీ ఫక్కీలో వెంబడించి పట్టుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు ఆ మహిళను అప్పగించారు.. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్ యత్నించిన మహిళ రఘునాథపల్లి మండలానికి చెందిన జ్యోతిగా గుర్తించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..