
కర్రెగుట్ట కొండలు ఇప్పుడు అభివృద్ధి, భద్రత దిశగా కొత్త అధ్యాయాన్ని చూడబోతున్నాయి.. ఈ ప్రాంతాన్ని ప్రధాన ప్రవాహంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా, రహదారి సదుపాయాలు, భద్రతా చర్యలు పెంచుతూ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే దిశగా చర్యలు చేపట్టారు.
ఈ ప్రణాళికలో భాగంగా తెలంగాణ వైపు కర్రెగుట్ట కొండల ప్రాంతంలో కొత్త రహదారి నిర్మాణాన్ని ప్రారంభించారు. ప్రతిపాదిత 30 కిలోమీటర్ల రహదారిలో ఇప్పటికే 12 కిలోమీటర్ల తాత్కాలిక మట్టి రోడ్డు పూర్తి చేశారు. భవిష్యత్తులో దీన్ని బిటుమెన్ రహదారిగా అప్గ్రేడ్ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ రహదారి ద్వారా రవాణా సౌకర్యాలు మెరుగుపడి, ప్రయాణ సమయం తగ్గి, స్థానిక గిరిజన ప్రజలు బయటి ప్రపంచంతో మరింత సులభంగా కలిసే అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు..
అదే సమయంలో అధికారులు అటవీ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి అవకాశాలను పరిశీలించారు. సహజసిద్ధమైన అందాలు, జలపాతాలు ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని గుర్తించారు. దీని ద్వారా స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెరిగి, స్థిరమైన జీవనోపాధి కల్పించవచ్చని భావిస్తున్నారు.భద్రత పరంగా కూడా కీలక చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ వైపు కొండల్లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన ప్రెజర్ మైన్స్ను పూర్తిగా నిర్వీర్యం చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. దీంతో ఈ ప్రాంతంలో భద్రత మరింత బలపడింది. అభివృద్ధి పనులు కూడా అటవీ సంరక్షణ చట్టాలను పాటిస్తూ కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.ప్రజల్లో నమ్మకం పెంచేందుకు అధికారులు అవసరమైన సరఫరాలు పంపిణీ చేయడంతో పాటు జీవనోపాధి మద్దతు కూడా అందిస్తున్నారు. మోటార్ సైకిళ్లు, ఆటోరిక్షాలు వంటి వనరులు అందజేస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సహకరిస్తున్నారు. కర్రెగుట్ట కొండలు తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ సరిహద్దులో విస్తరించి ఉండటంతో, ఈ ప్రాంత అభివృద్ధి రెండు రాష్ట్రాలకూ కీలకంగా మారనుంది.