KCR Election Campaign: కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది.. మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో 12 పార్లమెంట్ సీట్లు గెలుస్తామని.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఈసారి 200 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదన్నారు. ఖమ్మంలో జరిగిన రోడ్షోలో బీఆర్ఎఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపారు కేసీఆర్. ఎన్నికల్లో నామా నాగేశ్వరరావుని ఎంపీగా గెలిపిస్తే కేంద్రంలో రాబోయే సంకీర్ణ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అవుతారని కేసీఆర్ జోస్యం చెప్పారు.
తెలంగాణలో 12 పార్లమెంట్ సీట్లు గెలుస్తామని.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఈసారి 200 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదన్నారు. ఖమ్మంలో జరిగిన రోడ్షోలో బీఆర్ఎఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపారు కేసీఆర్. ఎన్నికల్లో నామా నాగేశ్వరరావుని ఎంపీగా గెలిపిస్తే కేంద్రంలో రాబోయే సంకీర్ణ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అవుతారని కేసీఆర్ జోస్యం చెప్పారు. కేంద్ర మంత్రిగా ఖమ్మం అభివృద్ధికి పాటుపడుతారని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో తాను ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.
ఖమ్మం మయూరి సెంటర్లో జరిగిన రోడ్ షోలో తెలంగాణలో ఉన్న కేంద్రమంత్రి, ముగ్గురు ఎంపీలపై విరుచుకుపడ్డారు కేసీఆర్. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ టార్గెట్ గా కేసీఆర్ ప్రచారం కొనసాగుతోంది. ఖమ్మంలో జరిగిన రోడ్షోలో బీజేపీపై విమర్శల దాడి చేశారు కేసీఆర్. ధాన్యం కొనమంటే కేంద్రం మొండికేసిందన్నారు. తెలంగాణ ఎంపీలు వెళ్లి దీనిపై అడిగితే కేంద్రమంత్రి నూకలు తినమని చెప్పారని గుర్తు చేశారు కేసీఆర్. ప్రధాని మోదీ గోదావరి జలాలు తీసుకు వెళ్లి పక్క రాష్ట్రాలకు ఇస్తానని చెబుతుంటే ఇక్కడున్న బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి కూడా దీనిపై మాట్లాడటం లేదన్నారు. తెలంగాణ వాటా తేల్చే వరకు తల తెగిపడ్డా ఒప్పుకునేది లేదని బీఆర్ఎస్ హయాంలో చెప్పామన్నారు కేసీఆర్.
మరోవైపు ఈ ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు కేసీఆర్. BRS 12 సీట్లు గెలుస్తుందన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని, నామా నాగేశ్వరరావు కేంద్రమంత్రి అవుతారన్నారు. మన హక్కులు, మన నీళ్ళ కోసం పోరాటం చేయాలంటే BRS గెలవాలన్నారు కేసీఆర్. తెలంగాణలో కరెంట్ కష్టాలు మొదలయ్యాయన్నారు కేసీఆర్. ఓయూలో కరెంటు కోతలు ఉన్నాయని, నీళ్ళు కూడా ఇవ్వడం లేదన్నారు. రైతు రుణమాఫీ పై..హరీష్ రాజీనామా చేసి వెళితే ఈ ముఖ్యమంత్రి తోక ముడిచారన్నారు కేసీఆర్. తులం బంగారం గురించి అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం కస్సు మంటోందని, రుణ మాఫీ అడిగితే రైతులను చెప్పులతో కొడతామంటున్నారని మండిపడ్డారు కేసీఆర్.
ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమన్నారు. ఇంకా చాలా మంది రైతులకు రైతుబంధు రాలేదని.. రైతు బంధు కోసం కొట్లాడతామని మాటిచ్చారు. వీళ్ల మెడలు వంచి పాత పద్ధతిలో రైతు బంధు అందరికీ వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో యువత ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..