Telangana Cabinet: కేబినెట్‌ కూర్పు, శాఖల కేటాయింపుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చలు.. మిగతా ఆరుగురు ఎవరు..

|

Dec 09, 2023 | 8:11 AM

కేబినెట్‌ కూర్పు, శాఖల కేటాయింపుపై సీఎం రేవంత్ రెడ్డి హస్తినలో హైకమాండ్‌తో కీలక చర్చలు జరిపారు. అర్ధరాత్రి వరకు అగ్రనేతలతో మేథోమథనం తర్వాత హైదరాబాద్‌కు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ప్రజాదర్బార్‌.. విద్యుత్‌ అధికారులతో సమీక్ష.. ఆర్టీసీ ఎండీతో భేటీతో బీజీ బీజీగా గడిపిన సీఎం రేవంత్‌ రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఢిల్లీ వెళ్లారు.

Telangana Cabinet: కేబినెట్‌ కూర్పు, శాఖల కేటాయింపుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చలు.. మిగతా ఆరుగురు ఎవరు..
Revanth Reddy
Follow us on

కేబినెట్‌ కూర్పు, శాఖల కేటాయింపుపై సీఎం రేవంత్ రెడ్డి హస్తినలో హైకమాండ్‌తో కీలక చర్చలు జరిపారు. అర్ధరాత్రి వరకు అగ్రనేతలతో మేథోమథనం తర్వాత హైదరాబాద్‌కు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ప్రజాదర్బార్‌.. విద్యుత్‌ అధికారులతో సమీక్ష.. ఆర్టీసీ ఎండీతో భేటీతో బీజీ బీజీగా గడిపిన సీఎం రేవంత్‌ రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఢిల్లీ వెళ్లారు. సరాసరి పార్లమెంట్‌కు చేరుకొని లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ సందర్భంగా మల్కాజిగిరి ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. దేశానికి పరిచయం చేసిన మల్కాజిగిరి ప్రజలు.. ఎల్లప్పుడు తన హృదయంలో ఉంటారన్నారు. రాజకీయ ప్రస్థానంలో కొడంగల్‌తో పాటు మల్కాజిగిరికి ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. రెండు నియోజకవర్గాల ప్రజలకు రుణపడి ఉంటానని లేఖలో వెల్లడించారు రేవంత్ రెడ్డి.

మిగతా ఆరుగురు ఎవరు..?

తెలంగాణ కేబినెట్‌లో సీఎం సహా 18 మంది మంత్రులు ఉండాలి. సీఎం రేవంత్‌ రెడ్డితో సహా 12 మందితో కాంగ్రెస్‌ కేబినెట్‌ కొలువుదీరింది. ప్రమాణస్వీకారం చేసిన 11 మంత్రుల్లో ఎవరెవరికి ఏ శాఖ కేటాయిస్తారు? కేబినెట్‌లో తీసుకోబోయే మరో ఆరుగురు ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ అంశాలే ప్రాధాన్యతగా సీఎం రేవంత్‌ ఢిల్లీ పర్యటనపై నే అందరి దృష్టి కేంద్రీకృతమై వుంది.. కేబినెట్‌ కూర్పు.. బెర్త్‌ల ఖరారుపై ఢిల్లీలో హైకమాండ్‌తో చర్చించారు సీఎం రేవంత్‌ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రేతో కలిసి ముందు కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. కేసీ వేణుగోపాల్‌ ఇంట్లో దాదాపు గంటన్నర పాటు చర్చలు జరిగాయి.

ఇక్కడే దాదాపుగా ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. ఆతరువాత ముగ్గురు కలిసి ఓ జాబితాతో ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే నివాసానికి వెళ్లారు. అదే టైమ్‌లో రాహుల్‌ గాంధీ కూడా ఖర్గే నివాసానికి చేరుకున్నారు. ఐదుగురు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. కేబినెట్‌లో కొత్తగా ఆరుగురు ఎవరనే అంశం సహా మంత్రులకు శాఖల కేటాయింపుపై దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. హైకమాండ్‌ ఆమోదం తరువాత సీఎం రేవంత్‌ ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకున్నారు.

ఇక ఇవాళ తెలంగాణ మూడో అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమవుతోంది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తారు. అక్బరుద్దీన్‌ అధ్యక్షతన సభలో కొత్త ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం కొనసాగుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..