
హైదరాబాద్ ఆగస్ట్ 31: నగరంలోని ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పికప్పుడూ కొత్త నిర్మాణాలు చేపడుతూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా మరో కొత్త ఫ్లైఓవర్ను పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మూసారాంబాగ్ – అంబర్పేట్ మధ్య మూసీ నదిపై కొత్తగా నిర్మించిన హైలెవల్ బ్రిడ్జ్ను సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రాంతంలో ఉన్న పాత వంతెన శిథిలావస్థకు చేరడంతో, దానికి పక్కనే అంతకంటే ఎక్కువ ఎత్తులో రూ.52 కోట్ల వ్యయంతో 400 మీటర్ల పొడవుతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. తాజాగా ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి రావడంతో మూసారాంబాగ్ – అంబర్పేట్ పరిసర ప్రాంతాల ప్రజలకు భారీ ఊరట కలగనుంది. ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు ప్రయాణ సమయం కూడా ఆదా కానుంది.
గతంలో మూసీ నదిపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో.. నది ఉధృతంగా ప్రవహించిన ప్రతిసారీ బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహించేది. దీనివల్ల మూసారాంబాగ్, అంబర్పేట్, మలక్పేట్ల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. దీంతో ఆ బ్రిడ్జిపై రాకపోకలను పూర్తిగా నిలిపివేసి, దాని స్థానంలో కొత్తగా హైలెవల్ బ్రిడ్జ్ నిర్మించాలని జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోవడంతో చాదర్ఘాట్, దిల్సుఖ్నగర్ రూట్లలో తీవ్ర ట్రాఫిక్ జామ్లు ఏర్పడేవి.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భావించిన అధికారులు, పాత బ్రిడ్జ్ పక్కనే మరో హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రూ.54 కోట్ల వ్యయంతో 400 మీటర్ల మేర అత్యాధునిక హంగులతో, వరద ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగని ఎత్తులో ఈ కొత్త హైలెవల్ బ్రిడ్జిని నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కొత్త బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభం కావడంతో అంబర్పేట్, రామాంతపూర్, కాచిగూడ ప్రాంతాల నుంచి మలక్పేట్, దిల్సుఖ్నగర్, ఎల్బీ నగర్ వైపు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు దూరమూ తగ్గుతుంది; తద్వారా సమయం కూడా ఆదా అవుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,