
సమాజ అభివృద్ధికి చేసేది ఖర్చుగా కాకుండా సామాజిక బాధ్యతగా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సీఎస్ఆర్ నిధులకు సంబంధించి వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం (ఏప్రిల్ 08) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేట్ కంపెనీలకు సీఎం రేవంత్ కీలక సూచనలు చేశారు. కార్పొరేట్ కంపెనీలు సీఎస్ఆర్కు చేస్తున్న వ్యయం వందకు వంద శాతం సత్ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. తమ ప్రభుత్వం విద్యా, వైద్యం, జల వనరుల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
కంపెనీలు తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని సీఎస్ఆర్ నిధులు వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వంతో పాటు కంపెనీలు కలిపి చేసే వ్యయంతో తెలంగాణ విద్యార్థులను ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగిన వారు తీర్చిదిద్దాలన్నారు. భవిష్యత్ అవకాశాలు అందిపుచ్చుకునేలా తెలంగాణ విద్యా్ర్థులను తయారు చేయాలని సీఎం రేవంత్ఠ రెడ్డి అన్నారు. విద్యపై పెట్టే వ్యయాన్ని తాము భవిష్యత్ తరాలపై పెట్టే పెట్టుబడిగా భావిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని విద్యార్థుల సంఖ్యలో హైదరాబాద్ మహానగరంలోనే 44 శాతం ఉన్నారని, వారికి నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందన్నారు.
వివిధ కంపెనీలు స్థానికంగా ఉన్న అన్ని మౌలిక వసతులను వినియోగించుకుంటున్నందున తమ సీఎస్ఆర్ నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని అదే ప్రాంత అభివృద్ధికి కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ సూచించారు. సీఎస్ఆర్ నిధుల వినియోగం కోసం ఒక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నియమించామని సీఎం తెలిపారు. కంపెనీల ప్రతినిధులు ఆయనతో సమన్వయం చేసుకుని తమకు ఆసక్తి ఉన్న విద్యా, వైద్యం, జల వనరులు, నైపుణ్య శిక్షణ, వారసత్వ కట్టడాల పరిరక్షణ, అడవుల సంరక్షణకు సీఎస్ఆర్ నిధులు వినియోగించవచ్చని ముఖ్యమంత్రి సూచించారు.
ఇప్పటికే రహేజా గ్రూప్ రూ.50 కోట్లు, రాంకీ గ్రూప్ రూ.50 కోట్లు, యశోద ఫౌండేషన్ రూ.10 కోట్లు విద్యాభివృద్ధికి కేటాయించేందుకు ముందుకు వచ్చాయని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. వారిని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సీఎస్ఆర్ నిధుల విషయంలో ఇప్పటి వరకు ఎవరూ తమను సంప్రదించలేదని అయా కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పాఠశాల విద్యా, ఆసుపత్రులు, వారసత్వ కట్టడాల పరిరక్షణకు పలు కంపెనీలు ఆసక్తి చూపాయి.
వీడియో ఇక్కడ చూడండి…
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..