CM Revanth Reddy : వాళ్లు తెలంగాణకు చేసిందేమి లేదు.. బీజేపీ , బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ పంచ్‌లు!

రాష్ట్రంలో ఫిబ్రవరి 11న జరగబోయే మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ఉద్దేశించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో త్రిముఖ పోరు జరుగుతోందని.. కాంగ్రెస్‌, బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉండబోతుందన్నారు. రాష్ట్రానికి ఎవరు ఏం చేశారో అనేది చూసి తెలంగాణ ప్రజలు ఆలోచించి తీర్పు ఇవ్వాలని ఆయన అన్నారు.

CM Revanth Reddy : వాళ్లు తెలంగాణకు చేసిందేమి లేదు.. బీజేపీ , బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ పంచ్‌లు!
Telangana Cm Revanth Reddy

Updated on: Feb 09, 2026 | 6:32 PM

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలి ఆయన ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్ట్‌ చేయలేదని.. మూడు సార్లు కేంద్రంలో అధికారంలో ఉన్నా పాలమూరుకు మొండిచెయ్యే చూపిందన్నారు. 12 ఏళ్లుగా కేంద్రం చేసిన అభివృద్ధి శూన్యమని సీఎం రేవంత్ అన్నారు.

దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోందని.. రాష్ట్ర పన్నుల వాటా తప్ప కేంద్రం తెలంగాణకు ప్రత్యేకంగా ఇచ్చింది ఏముందని ప్రశ్నించారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఉత్తరాది రాష్ట్రాలకు పన్నుల వాటా కంటే రెండు, మూడు రెట్లు అధిక నిధులు ఇస్తూ.. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తోందని సీఎం రేవంత్ అన్నారు.

రాష్ట్రంలోని బీజేపీ నేతలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని సీఎం రేవంత్‌ అన్నారు. మూసీ అభివృద్ధికి కిషన్ రెడ్డి, బండి సంజయ్ నిధులు తెచ్చారా? అని ప్రశ్నించారు. తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదని మోదీని ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన మండిపడ్డారు.

ఇదిలా ఉండగా గత బీఆర్ఎస్ హాయాంలో తీవ్ర సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై కూడా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ హయాంలో అందరూ ట్యాపింగ్ బాధితులేనని.. ప్రతిపక్షాలు, జడ్జిలు, సినీ తారలు, జర్నలిస్టుల ఫోన్లు సైతం ట్యాప్‌ చేశారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌తో వందల కోట్లు సంపాదించారని..ఇప్పటికీ అహకారంతో విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.