Chicken Prices: మాంసం ప్రియులకు షాకింగ్ న్యూస్.. కొండెక్కిన చికెన్ ధరలు.. ప్రస్తుతం కిలో ఎంతంటే..?

చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్. ముక్క దిగాలంటే జేబులకు చిల్లులు పడాల్సిందే. చికెన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని వారాల క్రితం కిలో రూ.250 పలకగా.. ఇప్పుడు ఏకంగా రూ.300 దాటింది. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.

Chicken Prices: మాంసం ప్రియులకు షాకింగ్ న్యూస్.. కొండెక్కిన చికెన్ ధరలు.. ప్రస్తుతం కిలో ఎంతంటే..?
Chicken Prices

Updated on: Jul 01, 2026 | 5:12 PM

సామాన్యులకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, వర్షాభావ పరిస్థితుల వల్ల కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో రోజువారీ ఖర్చు పెరిగింది. ఈ క్రమంలో సామాన్యులకు అందుబాటులో ఉంటే చికెన్ ధరలు కూడా భారీగా పెరిగాయి. రెండు వారాల క్రితం కిలో చికెన్ రూ.250 వద్ద ఉండగా.. క్రమక్రమంగా పెరుగుతూ ఇప్పుడు ఏకంగా రూ.300 మార్క్ దాటింది. రిటైల్ షాపుల్లో కిలో రూ.300 నుంచి 330 మధ్య విక్రయిస్తున్నారు. దీంతో రెండు వారాల్లోనే రూ.50కి పైగా పెరుగుదల నమోదు చేసింది. దీంతో ముక్క లోపలికి వెళ్లాలంటే మాంసం ప్రియులు ఎక్కువ సొమ్ము వెచ్చించాల్సి వస్తోంది. రవాణా ఖర్చులు పెరగడం, కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.

రూ.300 దాటిన చికెన్ ధర

హైదరాబాద్ జోన్‌లో కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.301 వద్ద కొనసాగుతోండగా.. షాపుల్లో రూ.330 వరకు విక్రయిస్తున్నారు.ఇక డ్రెస్స్‌డ్ చికెన్ కిలో రూ.267గా పలుకుతోండగా.. ఫారం వద్ద లైవ్ బర్డ్ రూ.145గా ఉంది. ఇక రిటైల్ లైవ్ బర్డ్ రూ.172గా ఉంది. ఇక కరీంనగర్ జోన్‌లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. అటు ఏపీలో చికెన్ ధరలు మరింత ఎక్కువ పలుకుతున్నాయి. విజయవాడ జోన్‌లో కేజీ స్కిన్‌లెస్ చికెన్ రూ.306గా ఉండగా.. డ్రస్స్‌డ్ చికెన్ రూ.271, రిటైల్ లైవ్ బర్డ్ రూ.175, ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.149 వద్ద ఉన్నాయి.

పెరిగిన గ్రుడ్ల ధరలు

ఇక చికెన్‌తో పాటు కోడి గ్రుడ్ల ధరలు కూడా పెరిగాయి. విజయవాడలో12 గ్రుడ్ల రిటైల్ ధర రూ.90గా ఉంది. ఇక హైదరాబాద్‌లో 12 కోడి గ్రుడ్ల ధర రూ.88 పలుకుతోంది. రిటైల్ షాపుల్లో ఒక్కొ గుడ్డు రూ.10 వరకు పలుకుతోంది. కోళ్ల దాణా ఖర్చులు బాగా పెరిగిపోయాయి. దీంతో కోళ్ల ఫామ్స్ నిర్వహణకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ కారణంతో కోళ్ల ఉత్పత్తిని ఫామ్స్ యజమానులు భారీగా తగ్గించారు. డిమాండ్‌కు తగ్గట్లు కోళ్ల ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరుగుతున్నట్లు పాల్ట్రీ యజమానులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో చికెన్, కోడి గుడ్ల ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు.  దీంతో రానున్న రోజుల్లో కిలో చికెన్ రూ.400 వరకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.

Follow Us