Telangana: ‘వస్తే రానీ.. పోతే పోనీ‘.. బీజేపీలో పరిణామాలపై బీఎల్ సంతోష్ కీలక కామెంట్స్..

Hyderabad: పార్టీలోకి వచ్చేవారు వస్తారు. వెళ్లేవారు వెళ్తారు. వారి కోసం పార్టీ సంస్థాగత విధానం మారదని తేల్చి చెప్పారు బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీలో కలకలం రేపుతున్నాయి. తాజాగా తెలంగాణ బీజేపీ కౌన్సిల్‌ సమావేశాలకు..

Telangana: ‘వస్తే రానీ.. పోతే పోనీ‘.. బీజేపీలో పరిణామాలపై బీఎల్ సంతోష్ కీలక కామెంట్స్..
BL Santhosh

Updated on: Oct 06, 2023 | 8:45 AM

Hyderabad, October 06: పార్టీలోకి వచ్చేవారు వస్తారు. వెళ్లేవారు వెళ్తారు. వారి కోసం పార్టీ సంస్థాగత విధానం మారదని తేల్చి చెప్పారు బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీలో కలకలం రేపుతున్నాయి. తాజాగా తెలంగాణ బీజేపీ కౌన్సిల్‌ సమావేశాలకు ఎజెండాపై పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి వచ్చేవారు వస్తారని, వెళ్లేవారు వెళ్తారని, వారి కోసమని పార్టీ సంస్థాగత విధానం మారదన్నారు. ప్రస్తుతమున్న పోలింగ్‌ బూత్‌ కమిటీలు, శక్తి కేంద్రాలు, బైఠక్‌లు కొనసాగుతాయని తేల్చిచెప్పారు.

పార్టీలో కొంతకాలంగా అసంతృప్తిగా ఉంటూ అసమ్మతి వ్యక్తం చేస్తున్న నేతలను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. టీబీజేపీలో కొందరు అసమ్మతి నేతలు ప్రధాని తెలంగాణ టూర్‌ను సీరియస్‌గా తీసుకోలేదు. ప్రధాని సభల్లోనూ పాల్గొనలేదు. విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరికొందరు నేతలు ప్రధాని సభలకు డుమ్మా కొట్టారు. ఈ తరుణంలో బీఎల్‌ సంతోష్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నేడో రేపో ప్రకటన వెలువడనున్న తరుణంలో సంతోష్‌ వ్యాఖ్యలు బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

మరోవైపు అసెంబ్లీ ఎన్నికల కోసం టీబీజేపీ ప్రకటించిన 14 కమిటీల్లో అసమ్మతి నేతలకు కీలక బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఘట్‌కేసర్‌లో నిర్వహించే కౌన్సిల్‌ భేటీలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా హాజరౌతున్నారు. ఎన్నికల సమయంలో అసంతృప్త నేతలను దారిలోకి తీసుకురాకపోతే అసలుకే మోసం వచ్చే అవకాశం ఉండటంతో నడ్డా కూడా ఈ దిశగా చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..