
ఆహార కల్తీ నిరోధక చర్యల్లో భాగంగా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ మరియు పోలీస్ టాస్క్ఫోర్స్ అధికారులు కరీంనగర్ జిల్లాలో ఒక భారీ కల్తీ నెట్వర్క్ను ఛేదించారు. మానవ వినియోగానికి ఉద్దేశించిన సోయాచంక్స్ (మిల్మేకర్) తయారీలో పశువుల దాణాగా ఉపయోగించే రఫ్ బ్రాన్ (Rough Bran) కలుపుతున్న ఒక ఫ్యాక్టరీపై అధికారులు ఉమ్మడిగా దాడి చేసి, పెద్ద మొత్తంలో నిల్వలను సీజ్ చేశారు.
అధికారుల కథనం ప్రకారం.. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామంలో ఉన్న ‘మెగా ఇండస్ట్రీస్’ (VS బ్రాండ్ సోయా చంక్స్) తయారీ ఫ్యాక్టరీపై టాస్క్ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సందర్భంగా ఫ్యాక్టరీలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్యాకింగ్పై ఫాసీ (FSSAI) గుర్తింపు, పోషకాల వివరాలను కలర్ఫుల్గా ముద్రించి, లోపల మాత్రం మనుషులు తినడానికి ఏమాత్రం పనికిరాని పశువుల తవుడు, గోధుమ పొట్టును మిక్స్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
దీంతో ఫ్యాక్టరీలో విక్రయానికి సిద్ధంగా ఉంచిన 755 కిలోల సోయా చంక్స్తో పాటు, తయారీ కోసం నిల్వ ఉంచిన 1600 కిలోల రఫ్ బ్రాన్ను (పశువుల దాణా) అధికారులు సీజ్ చేశారు. ఈ ముడి పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే కోణంలో దర్యాప్తు చేయగా, వరంగల్లోని ఒక మిల్లింగ్ యూనిట్ నుంచి వీటిని కొనుగోలు చేసినట్లు తేలింది. సీజ్ చేసిన ఉత్పత్తుల నుంచి ఎన్ఫోర్స్మెంట్ నమూనాలను సేకరించిన అధికారులు, నాణ్యత పరీక్షల నిమిత్తం వాటిని వెంటనే ప్రభుత్వ ల్యాబొరేటరీకి పంపించారు. ల్యాబ్ నివేదిక రాగానే నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, కఠిన చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని సిబ్బంది తెలిపారు.
ఇటీవల కాలంలో మార్కెట్లో కల్తీ ఆహార పదార్థాలు విచ్చలవిడిగా పెరిగిపోవడంపై ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఇలాంటి కల్తీ మిల్మేకర్ను తింటే తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్యలు, లివర్ ఇన్ఫెక్షన్లు, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే ఇలాంటి కల్తీ వ్యాపారులపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఫ్యాక్టరీలను శాశ్వతంగా సీజ్ చేస్తామని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ స్పష్టం చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..