
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో ఒక్కసారిగా కొండచిలవ కలకలం రేగింది. పంట పొలాల్లో పని చేసుకుంటున్న రైతులు, కూలీల కళ్లముందు ఏకంగా ఏడడుగుల పొడవున్న భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. దాన్ని చూడగానే కూలీలు భయంతో పరుగులు తీయగా, ఒక రైతు మాత్రం ప్రాణాలకు తెగించి సాహసం చేశాడు. సుధానపల్లి గ్రామానికి చెందిన వెంకన్న అనే రైతు తన పొలంలో వరి కోతలు కోయిస్తున్నారు. రైతులు, కూలీలు పనుల్లో నిమగ్నమై ఉండగా ఎక్కడి నుండి వచ్చిందో కానీ ఒక భారీ కొండచిలువ అకస్మాత్తుగా పొలం మధ్యలో ప్రత్యక్షమైంది. దాని పొడవు, వేగాన్ని చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ప్రాణభయంతో పొలం విడిచి పరుగులు పెట్టారు.
అందరూ భయంతో వణికిపోతుంటే, రైతు వెంకన్న మాత్రం వెనకడుగు వేయలేదు. ఆ కొండచిలువ అలాగే ఉంటే పొలం పనులకు ఆటంకం కలగడమే కాకుండా ఎవరికైనా హాని చేస్తుందని భావించాడు. వెంటనే ఒక కర్రను తీసుకుని ఆ కొండచిలువను కొట్టి, దాన్ని దారికి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సుమారు ఏడు అడుగుల పొడవున్న ఆ భారీ పామును ఏమాత్రం భయం లేకుండా తన భుజాలపై వేసుకుని నడుచుకుంటూ వెళ్లాడు. ఆ దృశ్యాన్ని చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.
ఆ కొండచిలువను భుజాన మోసుకెళ్లిన వెంకన్న, పొలం శివార్లలోని అటవీ ప్రాంతంలో దాన్ని సురక్షితంగా వదిలేశాడు. దీంతో గంటల తరబడి నెలకొన్న ఉత్కంఠకు తెరపడటమే కాకుండా కూలీలు, తోటి రైతులు ఊపిరి పీల్చుకున్నారు. పంట పొలాల్లో ఇలాంటి భారీ కొండచిలువలు సంచరించడం పట్ల స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.ఏది ఏమైనా, వెంకన్న చేసిన ఈ సాహస కృత్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.