SHE Teams: మహిళలను వేధించిన పోకిరీలు.. షీ టీమ్స్ కఠిన చర్యలు

షీ టీమ్స్ ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. మహిళల కోసం చట్టాలు పకడ్బందీగా అమలవుతున్నా పోకిరీలు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. బస్టాపుల్లో, పార్కుల్లో, బహిరంగ ప్రదేశాల్లో టీజింగ్ కు పాల్పడుతూ పోలీసులకు చిక్కుతున్నారు. ఇక షీ టీమ్స్ నిఘా పెడుతుండటంతో చాలామంది దొరికిపోతున్నారు. తాజాగా 100 మందికిపైగా కౌౌనెల్సింగ్ ఇచ్చారు.

SHE Teams: మహిళలను వేధించిన పోకిరీలు.. షీ టీమ్స్ కఠిన చర్యలు
Jail

Updated on: Mar 17, 2024 | 7:44 AM

షీ టీమ్స్ ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. మహిళల కోసం చట్టాలు పకడ్బందీగా అమలవుతున్నా పోకిరీలు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. బస్టాపుల్లో, పార్కుల్లో, బహిరంగ ప్రదేశాల్లో టీజింగ్ కు పాల్పడుతూ పోలీసులకు చిక్కుతున్నారు. ఇక షీ టీమ్స్ నిఘా పెడుతుండటంతో చాలామంది దొరికిపోతున్నారు. తాజాగా 100 మందికిపైగా కౌౌనెల్సింగ్ ఇచ్చారు. మహిళలను వేధించిన 61 మందికి, 59 మంది మైనర్లకు రాచకొండ మహిళా భద్రతా విభాగం(డబ్ల్యూఎస్ డబ్ల్యూ), షీ టీమ్స్ శనివారం కౌన్సెలింగ్ ఇచ్చాయి. ఎల్బీనగర్ లోని డబ్ల్యూఎస్ డబ్ల్యూ కార్యాలయంలో నిందితుల కుటుంబ సభ్యుల సమక్షంలో సమావేశం నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలో 45 రోజుల్లో బాధితుల నుంచి 135 ఫిర్యాదులు అందాయి. వీరిలో 76 మంది వ్యక్తిగతంగా, 36 మంది వాట్సాప్, కాల్స్ ద్వారా, 14 మంది డైరెక్ట్ కాల్స్ ద్వారా, 9 మంది సోషల్ మీడియా యాప్ల ద్వారా వేధింపులకు గురయ్యారు.

ఈ సందర్భంగా రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి మాట్లాడుతూ బాలికలు, మహిళలను వేధించే దుండగులను షీ టీమ్స్, రాచకొండ పోలీసులు వదిలిపెట్టబోరన్నారు. మారువేషంలో పోలీసు అధికారులు బస్టాపులు, రైల్వే, మెట్రో రైలు స్టేషన్లు, పాఠశాలలు, కళాశాలలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నారని, బాలికలు, మహిళలను వేధించే వారిని పట్టుకుంటామని చెప్పారు. అందిన ఫిర్యాదుల్లో ఆరుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని, 60 మందిపై చిన్న చిన్న అభియోగాలు, 59 మంది మైనర్లకు కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు పూర్తి భద్రత కల్పించాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దార్శనికతలో భాగంగా 2014 అక్టోబరు 24న హైదరాబాద్ నగరంలో ‘షీ టీమ్స్’ను ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో షీ టీమ్స్ ఘనవిజయం సాధించిన దృష్ట్యా తొలుత సైబరాబాద్ లో, ఆ తర్వాత 2015 ఏప్రిల్ నుంచి తెలంగాణలోని ప్రతి జిల్లాలోనూ అమలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని షీ టీమ్స్ చేస్తున్న పనులను ఉమెన్ సేఫ్టీ వింగ్ పర్యవేక్షిస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం 331 షీ టీమ్స్ పనిచేస్తున్నాయి.