
గేమింగ్ ప్రపంచంలో సరికొత్త అనుభూతిని పంచేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం సిద్ధమైంది. హెడ్సెట్ల వినియోగంతో వచ్చే అసౌకర్యాన్ని తొలగిస్తూ అద్భుతమైన ఆడియో క్వాలిటీ అందించేందుకు ఈ డివైజ్ రూపుదిద్దుకుంది. నవంబర్ నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానున్న ఈ స్పీకర్ల పూర్తి విశేషాలు ఇప్పుడు చూద్దాం.
ఈ పల్స్ ఎలివేట్ స్పీకర్లలో ప్లానార్ మాగ్నెటిక్ డ్రైవర్లతో పాటు బిల్ట్-ఇన్ వూఫర్లను అందించారు. దీంతో గేమ్ ఆడుతున్నప్పుడు ప్రతి చిన్న శబ్దం కూడా చాలా స్పష్టంగా, మంచి బేస్తో వినిపిస్తుంది. ప్లేస్టేషన్ 5కి కనెక్ట్ చేసినప్పుడు ఇది టెంపెస్ట్ 3D ఆడియో టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. ఫలితంగా గేమ్లో మన చుట్టూ నిజంగానే ఆ వాతావరణం ఉందనే అనుభూతి కలుగుతుంది.
ఇందులో ప్లేస్టేషన్ లింక్, బ్లూటూత్ అనే రెండు ఆప్షన్లు ఉన్నాయి. గేమింగ్ ఆడుతున్నప్పుడు స్పీకర్లను ఒక్కసారిగా పీసీ లేదా పీఎస్ 5తో పాటు మొబైల్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే గేమ్ ఆడుతూనే మొబైల్ నుంచి పాటలు వినడం లేదా ఫోన్ కాల్స్ మాట్లాడటం చాలా తేలిక అవుతుంది. ఇందులో ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్లు ఉన్నందున హెడ్సెట్ లేకుండానే స్పష్టంగా మాట్లాడవచ్చు.
ఈ స్పీకర్ల కోణాన్ని మనకు నచ్చినట్లు అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటిలో బిల్ట్-ఇన్ రీఛార్జబుల్ బ్యాటరీలు ఉంటాయి కాబట్టి డెస్క్ నుంచి పక్కకు తీసుకెళ్లి ఫోన్ లేదా ప్లేస్టేషన్ పోర్టల్కి కనెక్ట్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఛార్జింగ్ డోక్స్ కూడా వీటితో పాటే వస్తాయి. వాల్యూమ్, మైక్ మ్యూట్ ఆప్షన్లు స్పీకర్ల పైనే ఇచ్చారు. ఈ పల్స్ ఎలివేట్ స్పీకర్లు నవంబర్ 12 నుంచి అందుబాటులోకి రానున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతాయి. దీని ధర సుమారు రూ. 18,500 నుండి రూ. 19,000 వరకు ఉంటుంది. ఇది మిడ్నైట్ బ్లాక్, వైట్ రంగుల్లో లభిస్తుంది. బ్లాక్ కలర్ గ్లోబల్గా అన్ని స్టోర్లలో దొరుకుతుంది. కానీ వైట్ వెర్షన్ మాత్రం కేవలం కొన్ని ఎంపిక చేసిన దేశాల్లో సోనీ అధికారిక ఆన్లైన్ వేదిక ద్వారా లభిస్తుంది.