
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తన యూజర్లకు సరికొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా Gen Z అభిరుచులకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లను ప్రకటించింది. కేవలం స్టాటిక్ ఫోటోలు, టెక్స్ట్ పోస్ట్లకే పరిమితం కాకుండా ఇకపై మీ ప్రొఫైల్ నుంచి మెమోరీస్ వరకు అన్నీ యానిమేటెడ్గా మారిపోనున్నాయి. ఇకపై మీ ప్రొఫైల్ ఫోటో ఒకేలా స్థిరంగా ఉండదు. ఏఐ సాయంతో మీ సాధారణ ఫోటోలకు మోషన్ ఎఫెక్ట్లను జోడించవచ్చు. మీ ఫోటోలో మీరు చేయి ఊపుతున్నట్లు, హృదయ ఆకారాన్ని చూపిస్తున్నట్లు లేదా వర్చువల్ పార్టీ టోపీ ధరించినట్లు యానిమేషన్లు చేయవచ్చు. స్పష్టమైన, కెమెరాకు ఎదురుగా ఉన్న ఫోటోలను ఉపయోగిస్తే ఈ ఫీచర్ అద్భుతంగా పని చేస్తుంది.
ఫేస్బుక్ స్టోరీస్, మెమోరీస్ కోసం రీస్టైల్ అనే ఏఐ టూల్ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా మీరు అప్లోడ్ చేసే ఫోటోను అనిమే, ఇలస్ట్రేటెడ్ లేదా గ్లోవీ వంటి విభిన్న థీమ్స్లోకి మార్చుకోవచ్చు. కేవలం ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు.. మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ బీచ్గానో లేదా సిటీస్కేప్గానో ఏఐ మార్చేస్తుంది.
మీరు రాసే టెక్స్ట్ పోస్ట్లు ఫీడ్లో ప్రత్యేకంగా కనిపించేలా ఇప్పుడు యానిమేటెడ్ బ్యాక్గ్రౌండ్స్ను జోడించుకోవచ్చు. ఆకులు రాలడం, సముద్రపు అలలు వంటి కదిలే దృశ్యాలను మీ పోస్ట్ వెనుక సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం కొత్తగా ప్రవేశపెట్టిన ఇంద్రధనస్సు A చిహ్నాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది.
ప్రస్తుతం ఫేస్బుక్కు 2.1 బిలియన్ల రోజువారీ వినియోగదారులు ఉన్నప్పటికీ.. యువతను ఆకర్షించడంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి మెటా ఈ నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు బాగా పాపులర్ అయిన పోక్ ఫీచర్ను మళ్లీ తెరపైకి తెచ్చి, ఫ్రెండ్స్ను పలకరించే వినూత్న మార్గంగా ప్రమోట్ చేస్తోంది. స్నేహితుల కోసం మాత్రమే ప్రత్యేక ఫీడ్, గ్రూపులలో రెడిట్ తరహాలో ప్రత్యేక యూజర్ పేర్లను పెట్టుకునే వెసులుబాటును కూడా కల్పించింది.
మొత్తానికి ఫేస్బుక్ తన పాత ముద్రను చెరిపేసుకుని, ఏఐ హంగులతో సరికొత్తగా ముస్తాబవుతోంది. ఈ కొత్త అప్డేట్లు రాబోయే రోజుల్లో యూజర్ల ఎంగేజ్మెంట్ను ఏ మేరకు పెంచుతాయో చూడాలి.