IPL 2026 : స్టార్ ప్లేయర్లు ఫెయిలైతే కెప్టెన్ ఏం చేస్తాడు ? ఆ ఇద్దరు కూడా బాధ్యత తీసుకోవాలన్న విండీస్ దిగ్గజం

IPL 2026 : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో కష్టాల్లో పడింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఒక్కరిని నిందించడం సరికాదని వెస్టిండీస్ దిగ్గజం ఇయాన్ బిషప్ అభిప్రాయపడ్డారు. సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ ప్లేయర్లు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

IPL 2026 : స్టార్ ప్లేయర్లు ఫెయిలైతే కెప్టెన్ ఏం చేస్తాడు ? ఆ ఇద్దరు కూడా బాధ్యత తీసుకోవాలన్న విండీస్ దిగ్గజం
Bumrah

Updated on: May 01, 2026 | 1:20 PM

IPL 2026 : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ (MI) పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఆరు ఓటములతో ప్లేఆఫ్ ఆశలు గల్లంతయ్యే స్థితిలో ఉన్న ఈ టీమ్ ప్రదర్శనపై ఇప్పుడు తీవ్రంగా చర్చ కొనసాగుతోంది. అయితే జట్టు వైఫల్యానికి కేవలం కెప్టెన్ హార్దిక్ పాండ్యాని మాత్రమే బాధ్యుడిని చేయడం సరికాదని వెస్టిండీస్ దిగ్గజం ఇయాన్ బిషప్ అభిప్రాయపడ్డారు. సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ ప్లేయర్లు కూడా బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు.

ముంబై ఇండియన్స్ ఎదుర్కొంటున్న వరుస ఓటములపై హార్దిక్ పాండ్యా స్పందిస్తూ.. తన వ్యక్తిగత ఫామ్ మెరుగుపడాల్సిన అవసరం ఉందని నిజాయితీగా అంగీకరించాడు. అయితే ఇయాన్ బిషప్ మాట్లాడుతూ.. “జట్టు ఫెయిల్యూర్ లో ఒక్క వ్యక్తిని బాధ్యుడిని చేయడం తప్పు. కెప్టెన్ దగ్గర ఎన్ని ప్లాన్స్ ఉన్నా, ప్లేయర్లు మైదానంలో రాణించకపోతే ఫలితం ఉండదు. హార్దిక్ వ్యూహాలు మార్చుకోవచ్చు, కానీ అతనికి స్టార్ ప్లేయర్ల సపోర్ట్ చాలా అవసరం” అని అన్నారు. సన్ రైజర్స్ తో జరిగిన గత మ్యాచ్ లో 243 పరుగులు చేసి కూడా కాపాడుకోలేకపోవడం ముంబై బౌలింగ్ వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది.

ముంబై టీమ్ లో ప్రధాన బలమైన సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా ఈ సీజన్ లో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. సూర్యకుమార్ 8 మ్యాచుల్లో కేవలం 162 పరుగులు మాత్రమే చేశాడు, అతని సగటు 20కి పడిపోయింది. ఇక బుమ్రా పరిస్థితి మరీ ఘోరం. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అతనికి అత్యంత కష్టతరమైన సీజన్ అని చెప్పొచ్చు. ఆడిన 8 మ్యాచుల్లో అతను కేవలం రెండు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ప్రపంచ స్థాయి బౌలర్ ఇలాంటి ప్రదర్శన ఇస్తాడని ఎవరూ ఊహించలేదు.

టీ20 ప్రపంచకప్ 2026 గెలిచిన తర్వాత బుమ్రా, సూర్య వంటి కీలక ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి దొరకలేదని బిషప్ విశ్లేషించారు. “వరల్డ్ కప్ గెలవడానికి వారు ఎంతో శ్రమించి ఉంటారు. మానసికంగా, శారీరకంగా వారు అలసిపోయి ఉండొచ్చు. నిజానికి బుమ్రా వంటి బౌలర్ కు ఐపీఎల్ కు ముందు తగినంత బ్రేక్ ఇచ్చి ఉంటే బాగుండేది. అప్పుడు అతను కొత్త ఉత్సాహంతో, తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుని బరిలోకి దిగేవాడు” అని బిషప్ అభిప్రాయపడ్డారు.

ముంబై ఇండియన్స్ ఇప్పుడు అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగిలిన ఆరు మ్యాచుల్లోనూ కచ్చితంగా గెలవాల్సిందే. ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటికి వెళ్లడం ఖాయం. ఈ పరిస్థితిలో కేవలం హార్దిక్ పాండ్యా వైపు చూడకుండా, జట్టులోని ప్రతి ఆటగాడు బాధ్యత తీసుకుని రాణించాల్సిన సమయం ఆసన్నమైంది. పోలార్డ్, జయవర్ధనే వంటి దిగ్గజాలు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us