Garfield Sobers: పాక్‌ను గడగడలాడించిన లెజెండరీ క్రికెటర్ కన్నుమూత! తీవ్ర విషాదంలో క్రికెట్ లోకం

వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ 89 ఏళ్ల వయసులో కన్నుమూశారు. టెస్ట్ క్రికెట్‌లో 8,032 పరుగులు, 235 వికెట్లు సాధించిన ఆయన ప్రపంచ అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. సోబర్స్ మరణంతో ప్రపంచ క్రికెట్ ఒక స్వర్ణయుగ ఆటగాడిని కోల్పోయిందని పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Garfield Sobers: పాక్‌ను గడగడలాడించిన లెజెండరీ క్రికెటర్ కన్నుమూత! తీవ్ర విషాదంలో క్రికెట్ లోకం
Garfield Sobers With Virat

Updated on: Jul 17, 2026 | 9:18 PM

ప్రపంచ క్రికెట్‌కు తీరని లోటు కలిగిస్తూ వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ కన్నుమూశారు. జూలై 17న 89 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. మరో పది రోజుల్లో 90వ పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉండగా ఆయన మరణవార్త క్రికెట్ అభిమానులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన సోబర్స్, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచి చిరస్థాయిగా నిలిచారు.

వెస్టిండీస్ తరఫున 93 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన సోబర్స్, 57.78 సగటుతో 8,032 పరుగులు చేశారు. ఆయన ఖాతాలో 26 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 1958లో పాకిస్థాన్‌పై చేసిన 365 పరుగులు (నాటౌట్) అప్పట్లో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచాయి. ఈ రికార్డు 36 సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా ఉండి, 1994లో బ్రియాన్ లారా 375 పరుగులతో అధిగమించారు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సోబర్స్ అసాధారణ ప్రతిభ కనబరిచారు. ఎడమచేతి ఫాస్ట్-మీడియం, స్పిన్ బౌలింగ్‌లతో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టిన ఆయన టెస్ట్ క్రికెట్‌లో 235 వికెట్లు సాధించారు. వన్డే క్రికెట్ ప్రారంభ దశలో ఉండటంతో ఆయన కేవలం ఒకే ఒక వన్డే మ్యాచ్ మాత్రమే ఆడే అవకాశం పొందారు.

1968లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గా కూడా సోబర్స్ చరిత్ర సృష్టించారు. నాటింగ్‌హామ్‌షైర్ తరఫున గ్లామోర్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాల్కం నాష్ బౌలింగ్‌లో ఈ అరుదైన ఘనత సాధించారు. ఆ ఘట్టం ఇప్పటికీ క్రికెట్ చరిత్రలో అత్యంత చిరస్మరణీయ క్షణాల్లో ఒకటిగా నిలిచింది. సోబర్స్ మృతిపై క్రికెట్ వెస్టిండీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. “ఒక గొప్ప ఇన్నింగ్స్ ముగిసింది. మా హృదయాల్లో సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు” అంటూ సోషల్ మీడియాలో నివాళులర్పించింది.

Follow Us