
దిగ్గజ క్రికెట్ విరాట్ కోహ్లీ ఆట చూసేందుకు ఎంత మంది క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తారో, కేవలం అతన్ని చూసేందుకే స్టేడియానికి ఎంత మంది వస్తారో చెప్పడం కష్టం. ప్రపంచవ్యాప్తంగా అభిమాన సముద్రాన్ని సంపాదించుకున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి ఆటగాడు టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి, ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్లోనే కొనసాగుతున్నాడు. అలాగే ఐపీఎల్ కూడా ఆడుతున్నాడు. తాజా సీజన్లో 675 పరుగులతో దుమ్మరేపాడు. ఫైనల్ మ్యాచ్లో సూపర్ ఇన్సింగ్స్ ఆడి, సిక్స్తో మ్యాచ్ ముగించి ఆర్సీబీకి రెండో కప్పు అందించాడు.
ఐపీఎల్లో కోహ్లీ ఆట చూసి ఆనందపడిన అభిమానులు, కాస్త గ్యాప్ ఇచ్చి ఆఫ్ఘనిస్థాన్తో జరిగే మూడు వన్డేల సిరీస్లోనూ విరాట్ బ్యాటింగ్ను ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. కానీ వారికి నిరాశే మిగిలేలా ఉంది. ఫిట్నెస్కు మారుపేరుగా నిలిచే విరాట్, తన కెరీర్లో తొలిసారి గాయంతో వన్డే సిరీస్కు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొడ కండాల గాయంతో విరాట్ కోహ్లీ ఆఫ్ఘనిస్థాన్తో ఈ నెల 13, 17, 20న జరిగే మూడు వన్డేలకు దూరం అయినట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే కోహ్లీ బ్యాటింగ్ చూసేందుకు మరింత కాలం ఎదురుచూడాల్సిందే.
పైగా విరాట్ కోహ్లీ 100 సెంచరీల మార్క్ అందుకోవడానికి పెద్దగా టైమ్ కూడా లేదు. 2027లో వన్డే వరల్డ్ కప్ వరకు కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడతాడని అంతా అనుకుంటున్నారు. కోహ్లీ కూడా ఇటీవలె ఈ విషయంపై స్పందిస్తూ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడుతాను అని పరోక్షంగా తెలిపాడు. మరి అప్పటి వరకు టీమిండియా ఆడే వన్డే మ్యాచ్ల లెక్క చూస్తే.. తక్కువగానే ఉన్నాయి. కానీ కోహ్లీ 100 సెంచరీల మార్క్ అందుకోవాలంటే ఇంకా 15 సెంచరీలు చేయాలి. మరి ఈ తక్కువ టైమ్లో ఆ రికార్డ్ సాధిస్తాడా లేదా అని అభిమానులు కంగారు పడుతుంటే.. దురదృష్టవశాత్తు ఇలా గాయాలతో సిరీస్లు దూరం అయితే ఎలా అని అనుకుంటున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి