Vaibhav Sooryavanshi : క్రికెట్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఇంగ్లాండ్ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడటం కష్టమేనా?

Vaibhav Sooryavanshi : ఇంగ్లాండ్‌తో రెండో టీ20లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కే అవకాశాలు తగ్గాయి. విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చబోమని కోచ్ మోర్నే మోర్కెల్ స్పష్టం చేశారు. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లపై టీమ్ మేనేజ్‌మెంట్ పూర్తి నమ్మకం వ్యక్తం చేసింది.

Vaibhav Sooryavanshi : క్రికెట్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఇంగ్లాండ్ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడటం కష్టమేనా?
Vaibhav Sooryavanshi

Updated on: Jul 04, 2026 | 7:21 AM

Vaibhav Sooryavanshi : భారత క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న.. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయబోతున్నాడు? టీమిండియాలో అతడికి ఎప్పుడు అవకాశం వస్తుందా అని అభిమానులంతా కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జులై 4న మాంచెస్టర్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగబోతున్న నేపథ్యంలో.. అందరి దృష్టి భారత తుది జట్టు పైనే ఉంది. వైభవ్‌ను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్స్ పెరుగుతున్న తరుణంలో, భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆయన ఇచ్చిన సమాధానం ప్రకారం.. ఈ యువ ఆటగాడు బరిలోకి దిగడానికి మరికొంత కాలం వెయిటింగ్ తప్పదని స్పష్టమైంది.

ఆ ముగ్గురు స్టార్ బ్యాటర్లను పక్కన పెట్టలేం

టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రస్తుతానికి విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చడానికి సిద్ధంగా లేదని మోర్నే మోర్కెల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత టాప్ ఆర్డర్‌లో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి సీనియర్, పవర్‌ఫుల్ బ్యాటర్లు ఉన్నారని, వారిలో ఎవరినీ అంత సులభంగా జట్టు నుంచి డ్రాప్ చేయలేమని ఆయన తేల్చి చెప్పారు. గత కొన్ని నెలలుగా జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తూ, అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్న ఆటగాళ్లపై నమ్మకం ఉంచడం టీమ్ మేనేజ్‌మెంట్ బాధ్యత అని మోర్కెల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

వరల్డ్ కప్ హీరో సంజూ శాంసన్‌పై నమ్మకం

వైభవ్ సూర్యవంశీ జట్టు ఎంపికపై కోచ్ మోర్కెల్ మరింత వివరంగా మాట్లాడారు. “సంజూ శాంసన్ ఇటీవలి టీ20 వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‎గా నిలిచాడు. అంతేకాకుండా ఐపీఎల్ సీజన్లలో కూడా పరుగుల వరద పారించాడు. కోచింగ్ స్టాఫ్ పరంగా చూస్తే, ఇప్పటికే నిరూపించుకున్న సీనియర్ ఆటగాళ్లకు పూర్తి మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం. ఒక యువ ఆటగాడు అవకాశం కోసం ఎదురుచూడటం అనేది క్రికెట్‌లో చాలా సహజమైన విషయం. అది జట్టుకు మంచిదే అయినప్పటికీ, మేము కేవలం ఒక టాప్ ఆర్డర్ బ్యాటర్ గురించే కాకుండా, మొత్తం జట్టు ప్రయోజనాలను, గెలుపు అవకాశాలను ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది” అని మోర్కెల్ వివరించారు.

నెట్స్‌లో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ అద్భుతం

అయితే వైభవ్ సూర్యవంశీ ప్రతిభను కోచ్ మోర్కెల్ తక్కువ చేయలేదు. నెట్స్ ప్రాక్టీస్ సమయంలో తానే స్వయంగా వైభవ్‌కు బౌలింగ్ వేసి ట్రైనింగ్ ఇచ్చానని, ఈ 15 ఏళ్ల కుర్రాడి బ్యాటింగ్ నైపుణ్యం చూసి తాను ఎంతగానో ప్రభావితమయ్యానని కొనియాడారు. వైభవ్ చాలా తక్కువ సమయంలోనే జట్టులోని మిగతా సీనియర్ ఆటగాళ్లతో మంచి సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడని, అతడి భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్పారు. భవిష్యత్తులో వైభవ్‌కు అవకాశం వచ్చినప్పుడు కచ్చితంగా అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటాడనే నమ్మకం తనకు ఉందని మోర్కెల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

జులై 4న మాంచెస్టర్‌లో భారత్, ఇంగ్లాండ్ రెండో టీ20

భారత్, ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ విషయానికి వస్తే, దురదృష్టవశాత్తూ ఇరు జట్ల మధ్య జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దీంతో ఇరు జట్లు ఇప్పుడు రెండో మ్యాచ్‌పైనే పూర్తి దృష్టి పెట్టాయి. ఈ కీలకమైన రెండో ముఖాముఖి పోరు జులై 4న మాంచెస్టర్ మైదానంలో జరగనుంది. ఈ సిరీస్‌లో ఎలాగైనా పట్టు సాధించాలని భారత్ చూస్తుండగా, హోమ్ గ్రౌండ్‌లో సత్తా చాటాలని ఇంగ్లాండ్ పట్టుదలతో ఉంది. వైభవ్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కకపోయినప్పటికీ, టీమిండియా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్‌తో బరిలోకి దిగుతోంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us