
Muhammad Zohaib: ‘క్రమశిక్షణా సమస్యల’ కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఆల్ రౌండర్ ముహమ్మద్ జోహైబ్ను ఇంటికి పంపించేసింది. అయితే, అసలు వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఈ క్రమంలో ఓ ట్వీట్ చేస్తూ.. “క్రమశిక్షణా సమస్యల కారణంగా ముహమ్మద్ జోహైబ్ను వెనక్కి పంపాం. మరిన్ని వివరాలు సరైన సమయంలో అందిస్తాం అంటూ ప్రకటించింది. 2026 టీ20 ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్లలో జోహైబ్ వేగంగా పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డాడు. నేపాల్తో జరిగిన మ్యాచ్లో, అతను 3వ స్థానంలో బ్యాటింగ్ చేసి 26 బంతుల్లో 19 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇటలీతో జరిగిన మ్యాచ్లో 9వ స్థానంలో బ్యాటింగ్కు దిగాడు. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి యుఎఇ 7 వికట్లు నష్టపోయిన 28 పరుగులతో నిలిచింది. ఈ క్రమంలో స్కోర్ చేయడం కంటే కేవలం ఓవర్లను ఆడే ప్రయత్నం చేశాడు. 22 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేశాడు.
మొత్తం మీద, 27 ఏళ్ల ఈ ప్లేయర్ 16 టీ20ఐ లలో 20.20 సగటు, 103.76 స్ట్రైక్ రేట్తో 303 పరుగులు చేశాడు. జులై 2025లో నైజీరియాపై అతని ఏకైక అర్ధ సెంచరీ వచ్చింది.
ఫిబ్రవరి 10న చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగే UAE ప్రారంభ మ్యాచ్కు ముందు జోహైబ్ను జట్టు నుంచి విడుదల చేశారు.
ఇదిలా ఉండగా, యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం 2025 టీ20 ఆసియా కప్ సందర్భంగా తాను చెప్పిన విషయాన్ని పునరుద్ఘాటించాడు. జట్టులో భారత సంతతికి చెందిన ఆటగాల్లు, పాకిస్తాన్ సంతతికి చెందిన ఆటగాళ్ల మధ్య ఎటువంటి విభజన లేదని వసీం చెప్పుకొచ్చాడు. “నిజం చెప్పాలంటే, భారత్ – పాకిస్తాన్ సమస్య లేదు. మేము UAE తరపున ఆడుతున్నాం. మేం ఎల్లప్పుడూ మమ్మల్ని ఒక కుటుంబంలా చూసుకుంటున్నాం” అని వసీం తెలిపాడు.
“మేం ఒక కుటుంబంలా, స్నేహితులలా జీవిస్తున్నాం. మేం కలిసి సమయం గడుపుతున్నాం, కలిసి తింటున్నాం. నిజం చెప్పాలంటే యూఏఈ జట్టులో భారత్-పాకిస్తానీలు ఎవరూ లేరు” అని ఆయన అన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..