Prize Money : ఐసీసీ, బీసీసీఐ నుంచి కళ్లు చెదిరే ప్రైజ్ మనీ..టీమిండియాకు మొత్తం ఎన్ని కోట్లు ముట్టిందో తెలిస్తే షాకవుతారు

Prize Money : టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడి, దేశం గర్వపడేలా చేసిన సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియాపై ఇప్పుడు కాసుల వర్షం కురుస్తోంది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి టైటిల్ నెగ్గిన భారత్‌కు ఐసీసీతో పాటు బీసీసీఐ కళ్లు చెదిరే నజరానాలను ప్రకటించాయి.

Prize Money : ఐసీసీ, బీసీసీఐ నుంచి కళ్లు చెదిరే ప్రైజ్ మనీ..టీమిండియాకు మొత్తం  ఎన్ని కోట్లు ముట్టిందో తెలిస్తే షాకవుతారు
Team India

Updated on: Mar 10, 2026 | 2:50 PM

Prize Money : టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడి, దేశం గర్వపడేలా చేసిన సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియాపై ఇప్పుడు కాసుల వర్షం కురుస్తోంది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి టైటిల్ నెగ్గిన భారత్‌కు ఐసీసీతో పాటు బీసీసీఐ కళ్లు చెదిరే నజరానాలను ప్రకటించాయి. గెలిచిన వెంటనే ఐసీసీ సుమారు రూ.27.48 కోట్ల ప్రైజ్ మనీని ప్రకటించగా, ఇప్పుడు బీసీసీఐ భారీ మొత్తాన్ని అనౌన్స్ చేసింది. దీంతో మన ఆటగాళ్లకు అందే మొత్తం ప్రైజ్ మనీ ఏకంగా రూ.158 కోట్లకు చేరింది.

టీమిండియా అద్భుత విజయానికి గుర్తుగా బీసీసీఐ మంగళవారం (మార్చి 10) ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. వరల్డ్ కప్ నెగ్గిన జట్టుకు రూ.131 కోట్ల నగదు బహుమతిని ఇస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. ఈ మొత్తాన్ని ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, సపోర్ట్ స్టాఫ్ మధ్య పంచుతారు. 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు బీసీసీఐ రూ.125 కోట్లు ప్రకటించగా, ఈసారి మరో రూ.6 కోట్లు పెంచి రికార్డు స్థాయి బహుమతిని అందించింది. ఐసీసీ ఇచ్చిన రూ.27.48 కోట్లు, బీసీసీఐ ఇచ్చే రూ.131 కోట్లు కలిపితే మొత్తం రూ.158.48 కోట్లు అవుతుంది.

భారత జట్టు ఈ విజయంతో ప్రపంచ క్రికెట్‌లో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మూడుసార్లు టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఇంతకుముందు 2007 (మొదటి ఎడిషన్), 2024లో భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. అంతేకాకుండా వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లు (2024, 2026) గెలిచిన తొలి జట్టుగా కూడా భారత్ రికార్డు సృష్టించింది. ఒకప్పుడు ఆస్ట్రేలియా వన్డేల్లో ఆధిపత్యం చలాయించినట్లు, ఇప్పుడు టీ20 ఫార్మాట్‌లో మెన్ ఇన్ బ్లూ తిరుగులేని శక్తిగా ఎదిగింది.

రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత పగ్గాలు అందుకున్న సూర్యకుమార్ యాదవ్, తన కెప్టెన్సీలో జట్టును అద్భుతంగా నడిపించాడు. టోర్నీ ఆరంభం నుంచి అజేయంగా నిలిచిన భారత్, ఫైనల్‌లో కివీస్‌ను మట్టికరిపించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విజయం తర్వాత దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. బీసీసీఐ ప్రకటించిన ఈ భారీ ప్రైజ్ మనీ ఆటగాళ్ల కష్టానికి దక్కిన ప్రతిఫలమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే ముంబైలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించి ఆటగాళ్లను అధికారికంగా సన్మానించేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us