
Rishabh Pant Injury Update: భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్లో నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు రిషబ్ పంత్ గాయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. లార్డ్స్లో జరిగిన మూడో టెస్టులో వికెట్ కీపింగ్ చేస్తుండగా పంత్ ఎడమ చేతి వేలికి గాయమైంది. దీంతో అతను మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు స్వీకరించాడు.
మాంచెస్టర్లో జరగనున్న నాలుగో టెస్టుకు ముందు రిషబ్ పంత్ తన ఫిట్నెస్ సాధనలో నిమగ్నమై ఉన్నాడు. అతను బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఫీల్డింగ్ డ్రిల్స్, ఫుట్బాల్ కూడా ఆడుతూ కనిపించాడు. సోషల్ మీడియాలో అతను పంచుకున్న వీడియోలు, ఫోటోలు అతని ఆరోగ్యం మెరుగుపడినట్లు సూచిస్తున్నాయి. అయితే, వికెట్ కీపింగ్ గ్లౌజులు ధరించి ప్రాక్టీస్ చేసిన వీడియోలు స్పష్టంగా లేవు.
పంత్ బ్యాటింగ్కు పూర్తి ఫిట్నెస్తో ఉన్నప్పటికీ, వికెట్ కీపింగ్ చేయడానికి అతని వేలి గాయం ఎంతవరకు సహకరిస్తుందనేది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషేట్ ఇటీవల మాట్లాడుతూ, “పంత్ టెస్టు మ్యాచ్కి దూరంగా ఉండాలని మేం కోరుకోవడం లేదు. మూడో టెస్టులో అతను చాలా నొప్పితోనే బ్యాటింగ్ చేశాడు. అతని వేలి నొప్పి తగ్గుతుందని ఆశిస్తున్నాం. వికెట్ కీపింగ్ అనేది చివరి దశ. అతను కీపింగ్ చేయగలడని నిర్ధారించుకోవాలి. ఎందుకంటే, మ్యాచ్ మధ్యలో కీపర్ను మార్చకూడదని మేం కోరుకుంటున్నాం” అని తెలిపారు.
మాంచెస్టర్ టెస్టు ప్రారంభానికి ముందు పంత్ వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తాడని, ఆ తర్వాతే అతని వికెట్ కీపింగ్ సామర్థ్యంపై తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఒకవేళ పంత్ వికెట్ కీపింగ్ చేయలేకపోతే, కేఎల్ రాహుల్ లేదా ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంది. రాహుల్ గతంలో టెస్టుల్లో వికెట్ కీపర్గా వ్యవహరించగా, జురెల్ మూడో టెస్టులో సబ్స్టిట్యూట్ కీపర్గా మంచి ప్రదర్శన కనబరిచాడు.
ప్రస్తుతం సిరీస్లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. సిరీస్ను నిలబెట్టుకోవాలంటే నాలుగో టెస్టులో భారత్ గెలవడం తప్పనిసరి. ఈ కీలక మ్యాచ్లో రిషబ్ పంత్ వంటి కీలక ఆటగాడి పూర్తి ఫిట్నెస్ జట్టుకు ఎంతో అవసరం. అతని బ్యాటింగ్ సామర్థ్యం టీమిండియా మిడిల్ ఆర్డర్కు బలాన్ని ఇస్తుంది. పంత్ పూర్తి ఫిట్నెస్తో వికెట్ కీపింగ్ చేస్తే, జట్టుకు మరింత సమతుల్యత వస్తుంది. లేనిపక్షంలో, జట్టు కూర్పులో కొన్ని మార్పులు తప్పకపోవచ్చు.
మాంచెస్టర్లో జులై 23 నుంచి ప్రారంభం కానున్న ఈ నాలుగో టెస్టులో పంత్ వికెట్ కీపింగ్ చేస్తాడా లేదా అన్నది చూడాలి. భారత అభిమానులు అతని పూర్తి కోలుకోవాలని ఆశిస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..