T20 World Cup 2026 : ఒకే రోజు రెండు సెమీఫైనల్స్? ఐసీసీ రిజర్వ్ డే ప్లాన్ అదిరిపోయిందిగా

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన నౌకౌట్ దశకు చేరుకుంది. లీగ్ దశ, సూపర్-8 గండాలను దాటుకుని నాలుగు జట్లు సెమీఫైనల్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. ఇక ఇక్కడి నుంచి జరిగే ప్రతి మ్యాచ్ ఒక యుద్ధమే. ఓడితే ఇంటికి.. గెలిస్తే ఫైనల్‌కు.. మార్చి 4 నుంచి ఈ సెమీస్ పోరు మొదలుకానుంది.

T20 World Cup 2026 : ఒకే రోజు రెండు సెమీఫైనల్స్? ఐసీసీ రిజర్వ్ డే ప్లాన్ అదిరిపోయిందిగా
Ind Vs Eng Semi Final Stats

Updated on: Mar 03, 2026 | 9:16 AM

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన నౌకౌట్ దశకు చేరుకుంది. లీగ్ దశ, సూపర్-8 గండాలను దాటుకుని నాలుగు జట్లు సెమీఫైనల్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. ఇక ఇక్కడి నుంచి జరిగే ప్రతి మ్యాచ్ ఒక యుద్ధమే. ఓడితే ఇంటికి.. గెలిస్తే ఫైనల్‌కు.. మార్చి 4 నుంచి ఈ సెమీస్ పోరు మొదలుకానుంది. తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తలపడనున్నాయి. ఇక రెండో సెమీఫైనల్లో భారత జట్టు ఇంగ్లాండ్‌తో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఢీకొనబోతోంది. ఈ కీలక మ్యాచుల కోసం ఐసీసీ కొన్ని ప్రత్యేక నిబంధనలను రూపొందించింది.

వర్షం వల్ల మ్యాచ్‌లు ఆగిపోతే అభిమానులు నిరాశ చెందకుండా ఉండేందుకు ఐసీసీ ఈసారి రిజర్వ్ డే సౌకర్యాన్ని కల్పించింది. ఒకవేళ మార్చి 4న జరగాల్సిన మొదటి సెమీఫైనల్ వర్షం కారణంగా పూర్తవ్వకపోతే, ఆ మ్యాచ్‌ను మరుసటి రోజు అంటే మార్చి 5కి మారుస్తారు. అలాగే మార్చి 5న జరగాల్సిన రెండో సెమీఫైనల్‌కు కూడా ఇలాంటి నిబంధనే వర్తిస్తుంది. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. మొదటి సెమీఫైనల్ వర్షం వల్ల వాయిదా పడితే, మార్చి 5వ తేదీన ఒకే రోజు రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది.

షెడ్యూల్ ప్రకారం మార్చి 5న భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కావాలి. ఒకవేళ మొదటి సెమీఫైనల్ రిజర్వ్ డేకి మారితే, దానిని మధ్యాహ్నం 3 గంటలకే ప్రారంభిస్తారు. తద్వారా క్రికెట్ ప్రేమికులు ఒకే రోజు రెండు హై-వోల్టేజ్ మ్యాచులను చూసే ఛాన్స్ దక్కుతుంది. మ్యాచ్ ఫలితం తేలడానికి ఐసీసీ అదనపు సమయాన్ని కూడా కేటాయించింది. సాధారణంగా ఇచ్చే సమయం కంటే రిజర్వ్ డే రోజున ఎక్కువ సమయం కేటాయించి, ఎలాగైనా విజేతను నిర్ణయించేలా ప్లాన్ చేశారు.

కేవలం సెమీఫైనల్ మాత్రమే కాదు, మార్చి 8న జరిగే గ్రాండ్ ఫైనల్‌కు కూడా ఇలాంటి నిబంధనలే వర్తిస్తాయి. నౌకౌట్ మ్యాచుల్లో కేవలం వాతావరణం వల్ల ఏ జట్టుకు అన్యాయం జరగకూడదనేది ఐసీసీ ఉద్దేశం. ప్రస్తుతం టీమిండియా ఫ్యాన్స్ అందరి కళ్లు వాంఖడే స్టేడియం పైనే ఉన్నాయి. సొంత గడ్డపై ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి రోహిత్ సేన ఫైనల్‌కు దూసుకెళ్లాలని కోట్లాది మంది భారతీయులు ప్రార్థిస్తున్నారు. అటు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరిగే పోరు కూడా హోరాహోరీగా సాగేలా కనిపిస్తోంది.

ఒకవేళ సెమీఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డే రోజు కూడా వర్షం వల్ల పూర్తిగా రద్దయితే ఏమవుతుందనే ప్రశ్న చాలా మందిలో ఉంది. అలాంటి పరిస్థితి తలెత్తితే, సూపర్-8 దశలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. అందుకే ప్రతి పాయింట్, ప్రతి రన్ రేట్ ఇప్పుడు జట్లకు కీలకంగా మారాయి. మార్చి 8న జరిగే తుది పోరులో కిరీటం ఎవరిని వరిస్తుందో చూడాలి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us