Team India: జట్టు నుంచే కాదు, కెప్టెన్సీ పోస్ట్ కూడా పీకేస్తారనుకోలే..: సూర్య షాకింగ్ కామెంట్స్..!

Suryakumar Yadav: టీ20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం భారత జట్టు కెప్టెన్సీ నుంచి తనను తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన నాయకత్వంలో ఒక్క సిరీస్‌ కూడా ఓడిపోలేదని, అయితే భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం అని సెలెక్టర్లు భావిస్తే గౌరవిస్తానని తెలిపాడు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై తనకు నమ్మకం ఉందని స్పష్టం చేశాడు.

Team India: జట్టు నుంచే కాదు, కెప్టెన్సీ పోస్ట్ కూడా పీకేస్తారనుకోలే..: సూర్య షాకింగ్ కామెంట్స్..!
Suryakumar Yadav Comments

Updated on: Aug 30, 2026 | 7:39 AM

Suryakumar Yadav: టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టును అద్భుతంగా విజయపథంలో నడిపించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆ టోర్నీ తర్వాత తనను జట్టు నుంచి, ముఖ్యంగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంపై మొదటిసారిగా బహిరంగంగా తన అభిప్రాయాలను పంచుకున్నాడు. తన నాయకత్వంలో భారత్ సాధించిన అప్రతిహత విజయాల పరంపరను గుర్తుచేసుకుంటూ, ఈ నిర్ణయం తనను ఎలా కలచివేసిందో వివరించాడు.

2024 జూలైలో భారత టీ20 జట్టు పగ్గాలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్, అప్పటి నుంచి తన సారథ్యంలో ఒక్క టీ20 సిరీస్‌లో కూడా ఓటమిని చవిచూడలేదు. అతని నాయకత్వ పటిమకు నిదర్శనంగా భారత్ ఆసియా కప్‌ను, ఆపై టీ20 ప్రపంచకప్‌ను కూడా విజయవంతంగా కైవసం చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో జట్టును అత్యున్నత శిఖరాలకు చేర్చిన సూర్యకుమార్, అగ్రశ్రేణి కెప్టెన్‌గా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు.

ఎక్కువమంది చదివినది: INDW vs THAIW: ఆసియాకప్‌లో తొలి పోరుకు సిద్ధమైన భారత్.. ఎక్కడ చూడాలంటే?

అయితే, ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల కోసం ఎంపిక చేసిన జట్టులో సూర్యకుమార్ యాదవ్‌కు చోటు దక్కలేదు. అంతేకాదు, అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా నియమించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ అనూహ్య పరిణామంపై సూర్యకుమార్ తన మనసులోని మాటలను వెల్లడించాడు. జట్టు ప్రకటన సమయంలో తన పేరు జాబితాలో లేకపోవడం చూసినప్పుడు మొదట తాను నవ్వానని చెప్పాడు. గత ఏడాది కాలంగా కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడల్లా నవ్వుతూ, ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపాడు. తనకు లభించిన అవకాశాల పట్ల ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటానని పేర్కొన్నాడు.

రెండేళ్లపాటు కెప్టెన్‌గా ఉంటాననుకున్నా..

అయితే, కొంతకాలం తర్వాత ఈ నిర్ణయం తనను తీవ్రంగా ఆలోచింపజేసిందని సూర్యకుమార్ అన్నాడు. “ఇది ఎలా జరిగింది? ఇది ఎలా సాధ్యం?” అనే ప్రశ్నలు తనను వేధించాయని వెల్లడించాడు. 2026 తర్వాత మరో రెండేళ్ల పాటు తానే భారత టీ20 జట్టుకు నాయకత్వం వహిస్తానని భావించానని సూర్యకుమార్ పేర్కొన్నాడు. ఒలింపిక్స్, ఆ తర్వాత మరో టీ20 ప్రపంచకప్ వంటి పెద్ద టోర్నీలు ముందున్న నేపథ్యంలో తన నాయకత్వ ప్రయాణం కొనసాగుతుందని అనుకున్నట్లు వివరించాడు.

వాళ్ల నిర్ణయాన్ని గౌరవిస్తా..

అయినప్పటికీ, భవిష్యత్తుకు ఇదే సరైన నిర్ణయమని సెలెక్టర్లు భావించి ఉంటే దాన్ని తాను గౌరవిస్తానని సూర్యకుమార్ స్పష్టం చేశాడు. వారి నిర్ణయంపై తాను ఎలాంటి వివాదానికి దిగలేదని పేర్కొన్నాడు. శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై కూడా సూర్యకుమార్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. శ్రేయస్ తనకు చాలా కాలంగా తెలుసని, అతను మంచి ఆటగాడే కాకుండా మంచి వ్యక్తి, మంచి నాయకుడు కూడా అని ప్రశంసించాడు. అతనిపై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పాడు.

వరుస విజయాలతో దూకుడుగా ఉన్న సమయంలో మార్పు..

అయితే, తనకు అసలు బాధ కలిగించింది మాత్రం జట్టు విజయాల పరంపర కొనసాగుతున్న సమయంలో నాయకత్వంలో మార్పు ఎందుకు అవసరమైంది అన్నదేనని సూర్యకుమార్ తెలిపాడు. గత రెండేళ్లలో ఒక్క సిరీస్‌ కూడా ఓడిపోలేదని, ప్రపంచకప్, ఆసియా కప్ గెలిచామని గుర్తు చేశాడు. అలాంటి సమయంలో అంతా సజావుగా సాగుతున్నప్పుడు ఈ మార్పు ఎందుకు వచ్చింది? అనే ప్రశ్న తనలో తలెత్తిందని చెప్పాడు.

ఒంటరిగా కూర్చున ఆలోచించేవాడిని..

జట్టు నుంచి తప్పించిన తర్వాత సుమారు నెలన్నర పాటు ఇంట్లోనే ఉండి, ఈ విషయంపై తీవ్రంగా ఆలోచించానని సూర్యకుమార్ వెల్లడించాడు. స్నేహితులు, కుటుంబ సభ్యులు తనను ఓదార్చుతూ ఇది జీవితంలో భాగమేనని చెప్పారని తెలిపాడు. కానీ, అందరూ వెళ్లిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్న సమయంలో ఈ నిర్ణయం గురించి మళ్ళీ ఆలోచించే వాడినని చెప్పాడు. తనను జట్టులోకి ఎంపిక చేయరు అనే విషయం అధికారిక ప్రకటనకు రెండు మూడు రోజుల ముందే తనకు తెలిసిందని సూర్యకుమార్ వెల్లడించాడు. సెలక్షన్ కమిటీ నుంచి ఫోన్ వచ్చి ఇక ముందుకు సాగాల్సిన సమయం వచ్చిందని చెప్పారని వివరించాడు. ఆ నిర్ణయం తనది కాదని, జట్టుకు అదే ఉత్తమమని భావించి సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని స్పష్టం చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us