
Smriti Mandhana : టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన పెళ్లి వాయిదా పడినప్పటి నుంచి ఆమె తదుపరి అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెళ్లి గురించి పెళ్లి ఆగిపోయి 10రోజులు దాటిపోవడంతో స్మృతి మంధాన నుంచి ఎలాంటి సమాచారం వస్తుందోనని నిరీక్షించారు. దాదాపు 12 రోజుల తర్వాత ఈ ఎదురుచూపులు ముగిశాయి. స్మృతి మంధాన తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక పోస్ట్ చేసింది. ఈ పోస్ట్లో ఆమె వివాహం గురించి తాజా సమాచారం ఇవ్వనప్పటికీ వరల్డ్ కప్ ఫైనల్ రోజు తన అనుభవాలను పంచుకుంది. దీంతో అభిమానులు కాస్త ఊరట చెందారు.
డిసెంబర్ 5న స్మృతి మంధాన తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక స్పాన్సర్డ్ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమె 2025లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన అనుభవాలను పంచుకుంది. వరల్డ్ కప్ గెలిచేందుకు పడిన నిరీక్షణ గురించి స్మృతి మంధాన మాట్లాడుతూ.. గత 12 ఏళ్లుగా వరల్డ్ కప్ ఓడిపోయిన ప్రతిసారి ఎప్పుడు గెలుస్తామో అని ఆలోచించేవాళ్లమని, నవంబర్ 2న ఇండియా ట్రోఫీ గెలిచినప్పుడు తనకు చిన్న పిల్లలాగా సంతోషం కలిగిందని చెప్పింది. వరల్డ్ కప్ ఫైనల్ను గుర్తు చేసుకుంటూ మంధాన.. “బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జట్టుకు ఏం అవసరమో దాని ప్రకారమే ఆడుతున్నాను కాబట్టి, పెద్దగా ఆలోచించాల్సిన అవసరం రాలేదు. కానీ, ఫీల్డింగ్ చేసేటప్పుడు మాత్రం అందరు దేవుళ్లను తలచుకున్నాను” అని చెప్పింది. “ఆ 300 బంతుల పాటు వికెట్ ఇప్పించు స్వామీ అంటూ దేవుడిని ప్రార్థిస్తూనే ఉన్నాను” అని ఆమె వివరించింది.
స్మృతి మంధాన పెళ్లి వాయిదా పడిన సుమారు 12 రోజుల తర్వాత ఈ పోస్ట్ వచ్చింది. గత నెల నవంబర్ 23న స్మృతి, ఆమె కాబోయే భర్త పలాశ్ ముచ్ఛల్ పెళ్లి మహారాష్ట్రలోని సాంగ్లీలో స్మృతి మంధాన ఇంట్లో జరగాల్సి ఉంది. కానీ అదే రోజున హఠాత్తుగా పెళ్లిని వాయిదా వేయాల్సి వచ్చింది. స్మృతి మంధాన కుటుంబం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. స్మృతి తండ్రి ఆరోగ్యం సరిగా లేకపోవడం (3-4 రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది) కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా పలాశ్ ముచ్ఛల్ కూడా ఆరోగ్యం బాగోలేక కొద్ది రోజులు ఆసుపత్రిలో చేరారు. అయితే అప్పటి నుంచి పెళ్లికి సంబంధించిన కొత్త తేదీ గురించి ఎలాంటి సమాచారం ఇప్పటివరకు రాలేదు. అభిమానులు ఆ కొత్త తేదీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.