IND vs ENG: బాగుంది రా మామ..! అంటూ నితీష్‌ కుమార్‌ రెడ్డికి గిల్‌ సర్‌ప్రైజ్‌.. వీడియో వైరల్‌

లార్డ్స్‌లోని మూడో టెస్ట్ మ్యాచ్‌లో నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఇంగ్లాండ్ ఓపెనర్లను త్వరగా అవుట్ చేశాడు. అతని కచ్చితమైన బౌలింగ్‌కు శ్లాఘించి, కెప్టెన్‌ గిల్ తెలుగులో "బాగుంది రా మామ" అని అరిచాడు. ఈ సంఘటన వైరల్‌గా మారింది. ఇంగ్లాండ్‌ 186 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది.

IND vs ENG: బాగుంది రా మామ..! అంటూ నితీష్‌ కుమార్‌ రెడ్డికి గిల్‌ సర్‌ప్రైజ్‌.. వీడియో వైరల్‌
Gill And Nitish

Updated on: Jul 10, 2025 | 9:22 PM

ఇంగ్లాండ్‌తో మొదలైన మూడో టెస్ట్‌లో మొదటి రోజు లార్డ్స్‌లో నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. అయితే నితీష్‌ సూపర్‌ బౌలింగ్‌ వేస్తే.. కెప్టెన్‌ గిల్‌ వైరల్‌ అవుతున్నాడు. అదేంటి.. అనుకుంటున్నారా? అందుకు కారణం గిల్‌ నితీస్‌ను ప్రశంసించడమే. అది కూడా తెలుగులో..

నితీష్‌ కుమార్‌ రెడ్డి తన తొలి ఓవర్లోనే ఇంగ్లాండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీలను అవుట్ చేసి, తన కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ తో ఇతర బ్యాటర్లను పెవిలియన్‌ చేర్చాడు. అయితే నితీష్‌ కుమార్‌ రెడ్డి ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ వేస్తుండగా.. ఇంగ్లాండ్‌ సీనియర్‌ బ్యాటర్‌ జో రూట్‌కు ఒక సూపర్‌ డెలవరీ వేశాడు. దాంతో స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న గిల్‌.. “బాగుంది రా మామ” అంటూ తెలుగులో గట్టిగా అరిచాడు. అది కాస్త స్టంప్‌ మైక్‌లో రికార్డ్‌ అయింది. కామెంటేటర్లు సైతం.. గిల్‌కు నితీష్‌ తెలుగు బాగా నేర్పించాడంటూ నవ్వుకున్నారు. అయితే ఈ సంఘటనతో ఆటగాళ్ల మధ్య ఎంత మంచి బాండింగ్‌ ఉందనే విషయం స్పష్టం అవుతోంది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. నితీష్‌ కుమార్‌ రెడ్డి సూపర్‌ బౌలింగ్‌తో ఇంగ్లాండ్‌కు భారత్‌ ఆరంభంలోనే గట్టి షాక్‌ ఇచ్చింది. కేవలం 44 పరుగులకే ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్‌ చేరారు. ఆ తర్వాత ఓలీ పోప్‌, జో రూట్‌ మధ్య మంచి భాగస్వామ్యం నమోదైంది. ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు వందకు పైగా పరుగుల పార్ట్నర్‌షిప్‌ నెలకొల్పారు. 44 పరుగులు చేసిన పోప్‌ను జడేజా అవుట్‌ చేశాడు. దీంతో ఇంగ్లాండ్‌ 153 పరుగుల వద్ద 3వ వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత కొద్ది సేపటికే హ్యారీ బ్రూక్‌ను జస్ప్రీత్‌ బుమ్రా బౌల్డ్‌ చేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ 4 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. జో రూట్‌ 66, కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ 10 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో నితీష్‌ కుమార్‌ రెడ్డి 2, జడేజా, బుమ్రా చెరో వికెట్‌ తీసుకున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి