
Shubman Gill : టీమిండియా కెప్టెన్, స్టార్ బ్యాట్స్మన్ శుభ్మన్ గిల్ మైదానంలోకి తిరిగి రావడానికి అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. సౌతాఫ్రికాతో జరిగిన కోల్కతా టెస్ట్ మ్యాచ్ సందర్భంగా మెడకు గాయం కావడంతో గిల్ టెస్ట్ సిరీస్కు దూరం అయ్యాడు. మొదట్లో గౌహతి టెస్టుకు సిద్ధమవుతాడని భావించినా, ఇప్పుడు సౌతాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్కు దూరం కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాకుండా డిసెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్కు కూడా అతని రీఎంట్రీ కష్టమేనని సమాచారం. తాజా నివేదిక ప్రకారం.. గిల్ గాయం కేవలం మెడకే పరిమితం కాలేదని, దీనికి సంబంధించి ముంబైలోని ఒక ప్రముఖ డాక్టర్ పర్యవేక్షణలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు.
ముంబై స్పెషలిస్ట్ పర్యవేక్షణలో చికిత్స
గాయం కారణంగా గౌహతి టెస్ట్ నుంచి తప్పుకున్న శుభ్మన్ గిల్ వెంటనే టీమ్ నుంచి వేరుపడి ముంబైకి చేరుకున్నారు.భారత కెప్టెన్ ప్రస్తుతం ముంబైలో ప్రముఖ వెన్నెముక గాయాల నిపుణుడు డాక్టర్ అభయ్ నేనేను సంప్రదించి టెస్టులు చేయించుకుంటున్నారు. గిల్ గాయం కేవలం మెడకు మాత్రమే పరిమితం కాలేదనే అనుమానంతోనే, గాయం తీవ్రతను తెలుసుకోవడానికి డాక్టర్ నేనే సలహా తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గిల్ గాయం కండరాలకు సంబంధించినదా లేదా అంతకు మించి తీవ్రమైనదా అని తెలుసుకోవడానికి ఎంఆర్ఐతో సహా పలు కీలక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే, గిల్ మరింత ఎక్కువ కాలం విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది.
ఇంజెక్షన్, సెలెక్షన్ కమిటీకి నివేదిక
గాయం వల్ల వచ్చే నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి శుభ్మన్ గిల్కు ఇంజెక్షన్ కూడా ఇచ్చినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గిల్ టెస్ట్ రిపోర్ట్లను నేరుగా సెలెక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కరుకు పంపుతున్నారు. ప్రస్తుతం అగార్కర్ సహా మొత్తం సెలెక్షన్ కమిటీ సభ్యులు గౌహతి టెస్ట్ రెండో రోజు ఆట తర్వాత వన్డే, టీ20 సిరీస్ల కోసం టీమ్ను సెలక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. సెలెక్టర్లు మాత్రం గిల్ డిసెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్కు అందుబాటులోకి వస్తారని ఆశిస్తున్నారు. అయితే వైద్య నివేదికలు వచ్చిన తర్వాతే అతని రీఎంట్రీ పై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..