
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరపున విధ్వంసకర ఇన్నింగ్స్లతో సంచలనం సృష్టించిన 15 ఏళ్ల వండర్కిడ్ వైభవ్ సూర్యవంశీ, ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అయితే ఈ మ్యాచ్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఈ యువ సంచలనానికి భారత టీ20 కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ గౌతమ్ గంభీర్ పూర్తి మద్దతుగా నిలిచారు.
ఐపీఎల్ 2026లో పరుగుల సునామీ సృష్టించి, కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే టీమిండియా నీలి రంగు జెర్సీని ధరించిన బీహార్ యువ కెరటం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20లో విఫలమైనప్పటికీ, ఈ యువ ఆటగాడి వెనుక తామున్నామంటూ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అండగా నిలవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
ఇది కూడా చదవండి: వాడిని క్షమించను.. నమ్మి 7 నెలల తర్వాత ఛాన్స్ ఇస్తే నట్టేట ముంచాడు..
యూరప్ పర్యటనలో భాగంగా ఐర్లాండ్తో జరిగిన మొదటి రెండు మ్యాచ్లలో వైభవ్కు బెంచ్కే పరిమితం చేశారు. అయితే, ఓపెనర్గా వరుస వైఫల్యాలతో నిరాశపరుస్తున్న సంజూ శాంసన్ స్థానంలో ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20లో మేనేజ్మెంట్ ఈ వండర్కిడ్ను బరిలోకి దించింది. క్రీజులోకి వచ్చిన వెంటనే రెండు సిక్సర్లు బాది తనదైన శైలిలో మెరుపులు మెరిపించినప్పటికీ, కేవలం 14 పరుగులకే విల్ జాక్స్ బౌలింగ్లో వెనుతిరిగాడు. ఇంగ్లండ్ పిచ్లపై జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ వేగవంతమైన బౌలింగ్ను ఎదుర్కోవడంలో ఈ యువకుడు కాస్త తడబడ్డాడు.
మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ యువ ఆటగాడిపై ప్రశంసల జల్లు కురిపించారు. కేవలం ఒకే ఒక్క మ్యాచ్తో వైభవ్ ప్రతిభను అంచనా వేయలేమని స్పష్టం చేశారు. “వైభవ్ నెట్స్లో బ్యాటింగ్ చేసే విధానం చూస్తే ఎంతో నేర్చుకోవచ్చు. తన వయసుకు మించిన పరిణతి, అంతులేని ఆత్మవిశ్వాసం అతని సొంతం. అరంగేట్రం మ్యాచ్లో అతను ఎంతమాత్రం ఒత్తిడికి గురైనట్లు అనిపించలేదు. అతని భయం లేని ఆటతీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. భవిష్యత్తులోనూ అతనికి మా పూర్తి మద్దతు ఉంటుంది” అని అయ్యర్ పేర్కొన్నారు.
Video: విజయం ముంగిట భారత్.. కట్చేస్తే.. టీమిండియా కొంపముంచిన ఆ రెండు ఓవర్లు..!
గతంలో వన్డే ఫార్మాట్లో కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన రికార్డు వైభవ్ సొంతం. ఐపీఎల్ 2026లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్పై వైభవ్ కేవలం 16 బంతుల్లోనే 43 పరుగులు చేసి మ్యాచ్ను లాగేసుకున్నాడు. ఆ విధ్వంసాన్ని కళ్లారా చూసిన అయ్యర్, ఈ ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగానే వైభవ్ను జట్టులోకి తీసుకురావాలని కోచ్ గౌతమ్ గంభీర్తో కలిసి గట్టిగా నిర్ణయించుకున్నారు.
ఐదు మ్యాచ్ల ఈ టీ20 సిరీస్లో భారత్ ఇప్పటికే వెనుకబడి ఉన్నప్పటికీ, జూలై 7న జరగబోయే మూడో టీ20లో వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం ఇచ్చేందుకే కెప్టెన్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సంజూ శాంసన్ ఈ పర్యటనలో ఓపెనర్గా ఘోరంగా విఫలం కావడం కూడా వైభవ్కు కలిసి రానుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..