Shreyas Iyer: కెప్టెన్సీ దక్కిన తర్వాత తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్! ఏమన్నాడంటే..?

బీసీసీఐ భారత T20 జట్టుకు శ్రేయస్ అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించింది. సూర్యకుమార్ యాదవ్ సరైన ఫామ్‌లో లేకపోవడం, 2028 ప్రపంచ కప్, ఒలింపిక్స్ కోసం జట్టును సిద్ధం చేయాలనే లక్ష్యంతో ఈ మార్పు జరిగింది. కెప్టెన్‌గా ఎంపికైనందుకు అయ్యర్ సంతోషం వ్యక్తం చేశాడు.

Shreyas Iyer: కెప్టెన్సీ దక్కిన తర్వాత తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్! ఏమన్నాడంటే..?
Shreyas Iyer

Updated on: Jun 08, 2026 | 8:14 AM

అందరి అంచనాలను నిజం చేస్తూ బీసీసీఐ భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ నియమించిన విషయం తెలిసిందే. మూడు నెలల క్రితం టీ20 వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. చాలా కాలంగా సూర్యకుమార్ యాదవ్ సరైన ఫామ్‌లో లేకపోవడం, మరోవైపు టీ20 జట్టులో స్థానం కోసం యువ ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ ఉండటం, 2028 టీ20 వరల్డ్ కప్, అదే ఏడాది ఒలింపిక్స్ ఉండటంతో అప్పటి వరకు టీమ్‌ను బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో సూర్యను తప్పించి, అయ్యర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

అయితే తనను భారత టీ20 కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై శ్రేయస్ అయ్యర్ తొలి సారి స్పందించాడు. ‘ఈ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించడం, నాయకత్వం వహించడం గొప్ప అనుభూతితో పాటు గౌరవంగా కూడా ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను.’ అంటూ అయ్యర్ పేర్కొన్నాడు. ముంబై టీ20 లీగ్‌లో ఫాల్కన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అయ్యర్.. లీగ్ మ్యాచ్‌ల సందర్భంగా టీమిండియా కెప్టెన్సీపై స్పందించాడు. నిజానికి అయ్యర్ టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడి చాలా కాలమే అయింది.

అసలు భారత సెలెక్టర్ల టీ20 ప్లాన్స్‌లో అయ్యర్ లేనే లేడు. కానీ దేశవాళి టోర్నీతో పాటు ఐపీఎల్‌లో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణించడంతో అయ్యర్‌పై సెలెక్టర్లు నమ్మకం ఉంచారు. టీ20 జట్టులోకి కేవలం ప్లేయర్‌గా కాకుండా ఏకంగా కెప్టెన్‌గానే అయ్యర్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇది నిజంగా గ్రేట్ కమ్ బ్యాక్ అనే చెప్పాలి. మరి సెలెక్టర్లు తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ టీమిండియాను అయ్యర్ విజయవంతం నడిపిస్తాడో లేదో చూడాలి. ఇప్పటికే రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2024, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో 2026లో టీమిండియా టీ20 వరల్డ్ కప్‌లు గెలిచి ఛాంపియన్ అయింది. మరి అయ్యర్ కెప్టెన్సీలో కూడా 2028లో టీ20 వరల్డ్ కప్ గెలిచి టీమిండియా హ్యాట్రిక్ కప్పులు కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us