Sanju Samson : తిలక్ వర్మ స్థానంలో సంజూ శాంసన్ ఎంట్రీ? టీమిండియా మేనేజ్‌మెంట్‌ను హెచ్చరించిన అభిషేక్

Sanju Samson : సంజూ శాంసన్‌ను తిలక్ వర్మ స్థానంలో మిడిల్ ఆర్డర్‌లో ఆడించడం సరైన నిర్ణయం కాదని మాజీ కోచ్ అభిషేక్ నాయర్ హెచ్చరించారు. టాప్ ఆర్డర్‌ లోనే సంజూ ప్రభావవంతమని పేర్కొంటూ టీమిండియా కాంబినేషన్‌పై కీలక సూచనలు చేశారు.

Sanju Samson : తిలక్ వర్మ స్థానంలో సంజూ శాంసన్ ఎంట్రీ? టీమిండియా మేనేజ్‌మెంట్‌ను హెచ్చరించిన అభిషేక్
Sanju Samson

Updated on: Jul 08, 2026 | 4:34 PM

Sanju Samson : భారత టీ20 జట్టు వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో టీమ్ కాంబినేషన్ పై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఐర్లాండ్ టూర్ చేజారిన తర్వాత, ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లోనూ భారత్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంతో జట్టులోకి సీనియర్ ప్లేయర్ సంజూ శాంసన్‌ను తిరిగి తీసుకురావాలనే డిమాండ్స్ ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ సహాయక కోచ్ అభిషేక్ నాయర్ మేనేజ్‌మెంట్‌కు ఒక కీలకమైన హెచ్చరిక చేశారు. కేవలం జట్టులోకి తీసుకోవాలనే ఒకే ఒక్క కారణంతో సంజూ శాంసన్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఆడించి, ఉన్న కాంబినేషన్‌ను పాడు చేసుకోవద్దని ఆయన గట్టిగా చెప్పారు.

ఇటీవల ఒక బ్రాడ్‌కాస్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పేలవ ఫామ్‌లో ఉన్న వైస్ కెప్టెన్ తిలక్ వర్మను పక్కన పెట్టి, ఆ స్థానంలో సంజూ శాంసన్‌ను ఆడించాలని సలహా ఇచ్చారు. దీనిపై అభిషేక్ నాయర్ స్పందిస్తూ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. “సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకురావాలని అనుకుంటే, అతడు విజయవంతం అయ్యే స్థానంలోనే ఉంచాలి. కేవలం జట్టులో ఇరికించాలి కాబట్టి నంబర్ 4, 5 లేదా 6వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం ఏమాత్రం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే సంజూ ఆ స్థానాల్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు, అక్కడ అతనికి మంచి రికార్డు కూడా లేదు” అని నాయర్ స్పష్టం చేశారు. సంజూ శాంసన్ తన కెరీర్‌లో ఓపెనర్‌గా లేదా టాప్-3లో వచ్చినప్పుడే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడని గుర్తు చేశారు. ఒకవేళ టాప్-3 లో స్థానం ఇవ్వలేకపోతే, అతడిని ఆడించకుండా ప్రస్తుత బ్యాటింగ్ లైనప్‌తోనే ముందుకు వెళ్లడం మంచిదని అభిప్రాయపడ్డారు.

ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి 2-0తో ముందంజలో ఉంది. ఈ సిరీస్‌లో సంజూ స్థానంలో వచ్చిన 15 ఏళ్ల యువ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ రెండు మ్యాచ్‌ల్లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ వరుస ఓటములపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలను అభిషేక్ నాయర్ సమర్థించారు. “ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు భారత్ 190 పరుగులు చేస్తోంది, కానీ లక్ష్యాన్ని చేజింగ్ సమయంలోనే తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఇందుకు ప్రధాన కారణం అక్కడి వాతావరణం, పిచ్ పరిస్థితులను మన ప్లేయర్లు సరిగ్గా అంచనా వేయకపోవడమే” అని నాయర్ విశ్లేషించారు. ఓటముల భయంతో లేదా కంగారులో ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని, కేవలం మార్పుల కోసమే జట్టును మార్చకూడదని హితవు పలికారు.

ప్రస్తుతం టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఉన్న తిలక్ వర్మ ఫామ్ మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. గతంలో ఒకసారి 45 బంతుల్లో 56 పరుగులు చేసిన తిలక్.. ఆ తర్వాత ఆడిన ఏ ఒక్క ఇన్నింగ్స్‌లోనూ కనీసం 20 పరుగుల మార్కును కూడా దాటలేకపోయాడు. క్రీజులోకి వచ్చిన తర్వాత పరుగులు చేయడానికి అతను తీవ్రంగా నడుము వంచాల్సి వస్తోంది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లోనూ తిలక్ వర్మ కేవలం 11 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలోనే గురువారం బ్రిస్టల్‌లో జరగబోయే నాలుగో కీలక టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us