27 కోట్లు దండగా.. కెప్టెన్సీనే కాదు.. ఏకంగా టీమ్‌ నుంచే ఔట్‌? గోయెంకా షాకింగ్‌ నిర్ణయం?

ఐపీఎల్ 2025లో రిషభ్ పంత్ అద్భుతమైన ఫామ్‌లో లేడు. అతని నిరాశాజనక ప్రదర్శన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. అతని తక్కువ పరుగులు, కీపింగ్ పైనా ప్రభావం చూపుతోంది. లక్నో ప్లే ఆఫ్స్ చేరుకుంటే పంత్ సేఫ్, లేదంటే అతని స్థానం ప్రమాదంలో ఉంది. రూ.27 కోట్ల ఖర్చుతో కొన్న ప్లేయర్ ఫామ్ లేకపోవడం లక్నో యజమానికి కలత కలిగిస్తోంది.

27 కోట్లు దండగా.. కెప్టెన్సీనే కాదు.. ఏకంగా టీమ్‌ నుంచే ఔట్‌? గోయెంకా షాకింగ్‌ నిర్ణయం?
Rishabh Pant

Updated on: May 05, 2025 | 8:07 PM

ఐపీఎల్‌ 2025లో రిషభ్‌ పంత్‌ బ్యాడ్‌ ఫామ్‌ కంటిన్యూ అవుతోంది. ఆదివారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 17 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు. దీంతో.. పంత్‌పై విమర్శలు మరింత ఎక్కువ అయ్యాయి. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన పంత్‌.. ఆటలో మాత్రం ఆ స్థాయి ఇంప్యాక్ట్‌ చూపించలేకపోతున్నాడంటూ చాలా మంది క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ట్రోల్‌ చేస్తున్నారు. రేటుకు తగ్గ రేంజ్‌లో ఆడట్లేదు.. రూ.27 కోట్లు దండగా అంటూ తిట్టిపోస్తున్నారు. నిజానికి పంత్‌పై హై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. లక్నో సూపర్‌ జెయింట్స్‌ను కప్పు అందిస్తాడని ఆ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా బలంగా నమ్మారు. కానీ, ఆశలు నెరవేరేలా కనిపించించడం లేదు. ప్రస్తుతానికి లక్నో 11 మ్యాచ్‌లు పూర్తి చేసుకొని ఐదు విజయాలు, ఆరు ఓటములు 10 పాయింట్లతో.. పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. ఇంకా వాళ్లకు ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉంది. కాకుంటే.. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ కచ్చితంగా గెలిచి తీరాలి. అప్పుడు 16 పాయింట్లతో మెరుగైన రన్‌రేట్‌తో ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది.

లక్నో సంగతి పక్కనపెడితే.. ఆ జట్టు కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ గురించి మాట్లాడుకోవాలి. పంత్‌ సరైన ఫామ్‌లో లేడు అది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిన విషయం. పంత్‌ ఐపీఎల్‌ హిస్టరీలోనే ఇదే అత్యంత వరెస్ట్‌ సీజన్‌ ఇదే. 2016లో తొలిసారి ఐపీఎల్‌ ఆడినప్పుడు కూడా పంత్‌ 10 మ్యాచ్‌ల్లో 198 రన్స్‌ చేశాడు. ఆ తర్వాత ఏ సీజన్‌లోనూ 300 కంటే తగ్గలేదు. అలాంటి ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన పంత్‌ 12.80 యావరేజ్‌తో కేవలం 128 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒకే ఒక్క హాఫ్‌ సెంచరీ ఉంది. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 63 పరుగులు చేశాడు. అంటే.. మిగతా 10 మ్యాచ్‌ల్లో మనోడు చేసింది కేవలం 65 మాత్రమే. పంత్‌ లాంటి ఒక స్టార్‌ ఆటగాడు.. 10 మ్యాచ్‌ల్లో 65 రన్స్‌ మాత్రమే చేశాడంటూ ఎవరైనా నమ్ముతారా? కానీ, ఇది నమ్మతీరాల్సిన ఒక చేదు నిజం. పైగా ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర రూ.27 కోట్లు పెట్టి పంత్‌ని కొన్న సంజీవ్‌ గోయెంకా ఈ నిజాన్ని జీర్ణించుకోగలరా?

సరే పంత్‌కు బ్యాడ్‌ టైమ్‌ నడుస్తుంది, కానీ, కెప్టెన్‌గా, కీపర్‌గా అయినా ఇంప్యాక్ట్‌ చూపిస్తున్నాడా అంటూ అదీ లేదు. రన్స్‌ చేయలేకపోతున్నాను అనే ప్రెజర్‌ పంత్‌ ఫేస్‌లో, అతని కీపింగ్‌లో క్లియర్‌గా కనిపిస్తుంది. ఇక కెప్టెన్సీపై కూడా ఆ ఒత్తిడి ఉంది. ఇదంతా గ్రౌండ్‌ కొచ్చీ మరీ గమనిస్తున్న సంజీవ్‌ గోయెంకా పంత్‌ విషయంలో ఏదో ఒకటి తేల్చుకోవాలని డిసైడ్‌ అయినట్లు ఇన్‌సైడ్‌ టాక్‌. ఈ సీజన్‌ తర్వాత పంత్‌ను వదిలించుకుంటే.. రూ.27 కోట్లు మిగలడంతో పాటు ఆ ధరతో ముగ్గురు మంచి ప్లేయర్లను తీసుకోవచ్చని అనుకుంటున్నారని సమాచారం. నికోలస్‌ పూరన్‌కు లేదా.. మరో మంచి ప్లేయర్‌ను తీసుకొని అతనికి కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని కూడా ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. కేవలం ఒక్క సీజన్‌లో విఫలం అయితే పంత్‌ లాంటి బిగ్‌ ప్లేయర్‌ను పంపించేస్తారా? అనే డౌట్‌ కొంత మందికి రావొచ్చు. అలాంటి వాళ్లు సంజీవ్‌ గోయెంకా గురించి తెలుసుకోవాలి.

లక్నో సూపర్‌ జెయింట్స్‌ కంటే ముందు.. 2016, 2017 సీజన్స్‌లో ఐపీఎల్‌లో పాల్గొన్న రైజింగ్‌ పూణె సూపర్‌ జెయింట్స్‌ కూడా ఆయనే ఓనర్‌. ఆ సమయంలో ధోని లాంటి ఒక దిగ్గజ ప్లేయర్‌ను తీసుకొని.. సీజన్‌ మధ్యలోనే సరిగ్గా కెప్టెన్సీ చేయడం లేదని తప్పించి అప్పటి ఆసీస్‌ యంగ్‌ ప్లేయర్‌ స్టీవ్‌ స్మిత్‌కు కెప్టెన్సీ ఇచ్చిన ఘనత ఆయనకు ఉంది. అంతెందుకు.. లక్నో సూపర్‌ జెయింట్స్‌ మాజీ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ను ఆయన గ్రౌండ్‌లోనే ఎలా అవమానించారో ప్రపంచం మొత్తం చూసింది. ఆయన అనుకున్న రిజల్ట్‌ రాకుంటే.. ధోని, రాహుల్‌నే లెక్కచేయని వ్యక్తి.. పంత్‌ను ఉపేక్షిస్తారని అనుకోవడానికి లేదు. అలా అని వారి విషయంలో చేసినట్లే చేస్తారని చెప్పలేం. బట్‌.. ప్రస్తుతానికి పంత్‌ కెప్టెన్సీ పొజిషన్‌తో పాటు లక్నో టీమ్‌లో ప్లేస్‌ కూడా డేంజర్‌లో అయితే ఉంది. ఒక వేళ లక్నో ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయితే పంత్‌ సేఫ్‌. అలా జరగలేదా.. ఎల్‌ఎస్‌జీలో వచ్చే సీజన్ కోసం కచ్చితంగా మార్పులైతే జరుగుతాయి.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..