
టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ మళ్లీ మైదానంలోకి దిగేందుకు గట్టిగా కసరత్తులు మొదలుపెట్టాడు. త్వరలో శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ కోసం రాంచీలో ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. విశేషమేంటంటే.. టీమిండియా దిగ్గజం ఎంఎస్ ధోనీతో కలిసి పంత్ జిమ్లో చెమటోడ్చుతున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోను భారత మాజీ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త క్షణాల్లో వైరల్గా మారింది. ఈ ఫోటోలో ధోనీ బ్లూ కలర్ ట్రాక్సూట్లో ఉండగా, పంత్ బ్లాక్ టీషర్ట్, షార్ట్లలో కనిపించాడు. ‘‘భారత క్రికెట్లోని ఇద్దరు అత్యుత్తమ ఫినిషర్లు’’ అంటూ నదీమ్ ఇచ్చిన క్యాప్షన్ ఫ్యాన్స్ను బాగా ఆకట్టుకుంటుంది.
ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో భారత జట్టు ప్రణాళికల్లో పంత్ లేకపోయినప్పటికీ.. శుభ్మన్ గిల్ నాయకత్వంలోని టెస్టు జట్టులో మాత్రం అతను అత్యంత కీలకమైన సభ్యుడిగా కొనసాగుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్గా పంత్కు ఐపీఎల్ 2026 సీజన్ అంతగా కలసిరాలేదు. 138.05 స్ట్రైక్ రేట్, 28.36 సగటుతో కేవలం 312 పరుగులు మాత్రమే చేశాడు. పంత్ వైఫల్యం, జట్టు ప్రదర్శన కారణంగా LSG పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. జూన్లో ముల్లన్పూర్లో ఆప్ఘనిస్థాన్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లోనే పంత్ చివరిసారిగా మైదానంలో కనిపించాడు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోవాలంటే టీమిండియా రాబోయే 9 టెస్టుల్లో కనీసం 7 మ్యాచ్లు గెలవాల్సి ఉంది. రాబోయే న్యూజిలాండ్ పర్యటన చాలా కఠినంగా ఉండే అవకాశం ఉన్నందున, అంతకంటే ముందే శ్రీలంకపై 2-0 తో సిరీస్ క్లీన్ స్వీప్ చేయడం భారత్కు చాలా ముఖ్యం.
ఇక గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్కు పూర్తిగా దూరమైన ధోనీ భవిష్యత్తుపై రకరకాల వార్తలు వస్తున్నాయి. రేవ్స్పోర్ట్స్ కథనం ప్రకారం.. చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ పదవి నుంచి స్టీఫెన్ ఫ్లెమింగ్ తప్పుకోవడంతో ధోనీ సీఎస్కే మెంటార్గా కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వరుసగా వరుసగా ప్లేఆఫ్స్కు దూరమైన సీఎస్కేను మళ్లీ ట్రాక్లోకి తెచ్చేందుకు ధోనీకి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.