
Shreyas Iyer: ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో కేవలం ఆరు పరుగుల తేడాతో ఓటమి పాలైన పంజాబ్ కింగ్స్, ఆ చేదు జ్ఞాపకాన్ని చెరిపివేయాలని భావిస్తోంది. తాజాగా జరిగిన జర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, ఈసారి అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, తన దృష్టి మొత్తం కేవలం ట్రోఫీ గెలవడంపైనే ఉందని స్పష్టం చేశాడు.
గత ఏడాది అక్టోబర్లో ఆస్ట్రేలియా పర్యటనలో క్యాచ్ అందుకునే క్రమంలో శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆ గాయం కారణంగా దాదాపు 7 కిలోల బరువు తగ్గిన అయ్యర్, తిరిగి ఫిట్నెస్ సాధించడం ఒక పెద్ద సవాలుగా మారిందని పేర్కొన్నాడు. “గాయం నుంచి కోలుకుని తిరిగి రావడం ఎప్పుడూ కష్టమే, కానీ నాకు సవాళ్లు అంటే ఇష్టం” అని ఆయన తన పట్టుదలను చూపించాడు.
2025 సీజన్లో శ్రేయస్ అయ్యర్ బ్యాటర్గా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 50.33 సగటు, 175.07 స్ట్రైక్ రేట్తో ఏకంగా 604 పరుగులు సాధించాడు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్తో జరిగిన క్వాలిఫైయర్-2లో అతను ఆడిన 87 పరుగుల ఇన్నింగ్స్ ఇప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. ఇప్పుడు అదే ఊపుతో 2026 సీజన్లోకి అడుగుపెడుతున్నాడు.
పంజాబ్ కింగ్స్ తన ఐపీఎల్ 2026 ప్రయాణాన్ని ఈ నెల 31న గుజరాత్ టైటాన్స్తో ప్రారంభించనుంది. న్యూ చండీగఢ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ ఈసారి ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ప్రత్యర్థులు ఎవరైనా సరే, గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని అయ్యర్ ధీమా వ్యక్తం చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..