
Pakistan: పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు విదేశీ గడ్డపై మరో ఘోర పరాభవం ఎదురైంది. ఇంగ్లాండ్తో లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో పాక్ 194 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమితో మూడు టెస్టుల సిరీస్ను 2-0 తేడాతో కోల్పోవడమే కాకుండా సేనా దేశాల్లో(దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) ఎనిమిదేళ్లుగా ఒక్క టెస్ట్ కూడా గెలవలేని దారుణమైన రికార్డును మూటగట్టుకుంది.
టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ ఆరంభంలోనే కొద్దిగా ఆకట్టుకుంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ను 290 పరుగుల వద్ద కట్టడి చేయడంతో మ్యాచ్పై పాక్ పట్టు సాధిస్తుందని అభిమానులు ఆశించారు. అయితే బ్యాటింగ్కు దిగిన బాబర్ సేన ఊహించని రీతిలో కుప్పకూలింది. ఇంగ్లాండ్ బౌలర్ల దాటికి తలవంచి తొలి ఇన్నింగ్స్లో కేవలం 110 పరుగులకే ఆలౌట్ అయి తీవ్ర నిరాశ పరిచింది.
రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ జట్టు 208 పరుగులకు ఆలౌట్ కావడంతో పాకిస్తాన్కు 389 పరుగుల భారీ లక్ష్యం ఎదురైంది. కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ బ్యాటర్లు ఏమాత్రం పోరాటపటిమ చూపించలేకపోయారు. ఇంగ్లాండ్ బౌలర్లు ఓలీ రాబిన్సన్ 4 వికెట్లతో చెలరేగగా, జోష్ టంగ్ 3, జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీసి పాక్ వెన్ను విరిచారు. ఫలితంగా పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్లో 194 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయం పాలైంది.
దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (సేనా) దేశాల్లో టెస్టు మ్యాచ్ గెలవాలనే పాకిస్తాన్ కల మరింత సంక్లిష్టంగా మారింది. మే 2018లో లార్డ్స్ వేదికగా ఆఖరిసారిగా గెలిచిన పాక్, ఆ తర్వాత అక్కడ ఆడిన 18 టెస్టుల్లో ఏకంగా 16 మ్యాచ్లలో ఓడిపోయింది. మిగిలిన 2 మ్యాచ్లు మాత్రమే డ్రాగా ముగిశాయి. గత ఎనిమిదేళ్లుగా ఒక్కటి అంటే ఒక్క రెడ్ బాల్ మ్యాచ్ కూడా గెలవలేకపోవడం పాక్ క్రికెట్ పతనానికి అద్దం పడుతోంది.
లీడ్స్లోని హెడ్డింగ్లే వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఒక ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇప్పుడు లార్డ్స్లో లభించిన 194 పరుగుల విజయంతో సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది. ఇక మూడో టెస్టు సెప్టెంబర్ 9 నుంచి బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా జరగనుంది. ఆఖరి మ్యాచ్లోనైనా పాకిస్తాన్ గెలిచి తమ దరిద్రానికి గుడ్ బై చెబుతుందో లేదో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..