IPL 2026 : బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ 2026 ఓపెనింగ్ సెర్మనీ రద్దు.. కారణం ఇదే

IPL 2026 : గతేడాది జరిగిన విషాదం నేపథ్యంలో ఐపీఎల్ 2026 ఓపెనింగ్ సెర్మనీని బీసీసీఐ రద్దు చేసింది. మార్చి 28న ఆర్‌సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. మే 31న జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా గ్రాండ్ క్లోజింగ్ సెర్మనీని నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.

IPL 2026 : బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ 2026 ఓపెనింగ్ సెర్మనీ రద్దు.. కారణం ఇదే
Ipl 2026

Updated on: Mar 26, 2026 | 3:26 PM

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది. మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య తొలి పోరు జరగనుంది. అయితే, ప్రతి ఏటా అట్టహాసంగా జరిగే ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీని ఈసారి రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆడంబరాలు, ఆర్భాటాలకు దూరంగా ఈ సీజన్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ ప్రారంభోత్సవాన్ని రద్దు చేయడానికి గల కారణాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవజీత్ సైకియా వెల్లడించారు. గతేడాది జూన్ 4న ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల సమయంలో చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ మృతుల పట్ల గౌరవం, వారి కుటుంబాల పట్ల సానుభూతిని ప్రకటిస్తూ.. ఎటువంటి వినోద కార్యక్రమాలు లేకుండా లీగ్‌ను ప్రారంభించాలని బోర్డు నిర్ణయించింది. కేవలం ఆటపైనే దృష్టి సారించి, బాధితుల జ్ఞాపకార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాతో మాట్లాడుతూ ఆయన ధృవీకరించారు.

ప్రారంభోత్సవం లేకపోయినా, మే 31న జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా గ్రాండ్ క్లోజింగ్ సెర్మనీని నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతానికి కేవలం మొదటి 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించిన బోర్డు, త్వరలోనే పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. గతేడాది షారుఖ్ ఖాన్, శ్రేయా ఘోషల్, దిశా పటాని వంటి తారలతో అట్టహాసంగా వేడుకలు జరిగాయి. కానీ ఈసారి ఆ కళ తప్పనుంది. అయితే ఫైనల్ రోజున మాత్రం అంతకు మించి సెలబ్రేషన్స్ ఉంటాయని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.

శనివారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానున్న ఆర్‌సీబీ – ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. మ్యాచ్ సమయంలో 10 నుండి 15 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి తొలిసారి ఐపీఎల్ కప్పు గెలిచిన ఆర్‌సీబీ, ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగుతోంది. సొంత గడ్డపై తమ పట్టు నిలుపుకోవాలని కోహ్లీ సేన భావిస్తుంటే, ప్యాట్ కమిన్స్ లేని లోటులో ఇషాన్ కిషన్ నాయకత్వంలోని హైదరాబాద్ ఎలా రాణిస్తుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us